తిరుపతి : టీటీడీ గోసంరక్షణశాలను మరో ఏడాదిన్నరలోగా దేశంలోనే ఆదర్శవంతమైన గోశాలగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలను శుక్రవారం ఈవో పరిశీలించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, నెయ్యి తయారీ కేంద్రం పనులను పరిశీలించారు.
గోవసతి షెడ్లు, గోవులకు సౌకర్యంగా ఉండేందుకు ఇసుకతో ఏర్పాటుచేసిన మైదానం, ఉత్తరాది రాష్ట్రాల నుంచి గోశాలకు తీసుకొచ్చిన కాంక్రీజ్, ఘిర్, సాహివాల్ జాతుల గోవులతోపాటు పుంగనూరు, ఒంగోలు జాతుల గోవులను పరిశీలించారు.
వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోవసతి షెడ్లలో గోవులకు ఆహ్లాదం కలిగించేలా ఏర్పాటుచేసిన సంగీతం బాగుందని, ఇక్కడ గోవులకు నిరంతరం మేత, నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 18 షెడ్లకు గాను 4 షెడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 14 షెడ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫీడ్మిక్సింగ్ ప్లాంట్ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపారాధన, నైవేద్యాల తయారీకి అవసరమయ్యే నెయ్యి ఉత్పత్తి చేసేందుకు సుమారు 600 గోవులు అవసరమవుతాయని చెప్పారు. ఇందులో ఇప్పటివరకు 100కు పైగా వివిధ దేశీయజాతుల గోవులను సమకూర్చుకున్నామని, మిగిలిన గోవులను దాతల ద్వారా సమీకరించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వివరించారు.