విజయనగరం జిల్లా : మొన్నటి వరకు కాకినాడ జిల్లాలో కనిపించి భయపెట్టిన పులి.. ఇప్పుడు విజయనగరంలో సంచరిస్తున్నది. రెండు రోజుల క్రితం పెద్దపులి జాడలు కనిపించడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పులిని భందించి తమను రక్షించాలని జిల్లాలోని పలు అటవీ ప్రాంతాల ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఇటీవల కాలంలో చిరుతలు, పెద్దపులులు జనంలోకి వస్తున్నాయి. ఆహారం, తాగు నీటి కోసం మైదాన ప్రాంతానికి వస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
విజయనగరం జిల్లాలో పెద్ద పులి పాదముద్రలు కనిపించి కలవరపెడుతున్నాయి. వంగర మండలంలో పెద్దపులి అడుగుల జాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో ఇటీవల చిరుత సంచరించి అక్కడి ప్రజలను చాలా రోజులపాటు నిద్ర కరవయ్యేలా చేసింది. ఆవులు, గేదెలు ఎన్నో పులి బారిన పడ్డాయి. కాగా, ఆ భయాందోళన కాస్తా విజయనగరం జిల్లాకు వ్యాపించింది. జిల్లాలోని వంగర మండలంలో పులి సంచారాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పులి జాడలను గుర్తించారు. పులిని పట్టుకునేందుకు అధికారులు బోనులు ఏర్పాటు చేస్తున్నారు.