కిలో కాయలు రూ.300-400
విడిగా ఒక్కో కాయ రూ.10 పైనే
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): వేసవి తీవ్రత పెరగడంతో మార్కెట్లో నిమ్మకాయ మీసం మెలేస్తున్నది. తగ్గేదేలే.. అంటూ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నది. ప్రస్తుతం విడిగా ఒక్కో కాయ రూ.10 పలుకుతున్నది. శని, ఆదివారాల్లో అయితే రూ.12కి పైగానే అమ్ముతున్నారు. మార్చి మొదట్లో రూ.50గా ఉన్న కిలో నిమ్మకాయల ధర.. ఇప్పుడు ఏకంగా ఏడింతలైంది. నాణ్యమైన నిమ్మకాయలు హోల్సేల్లో మార్కెట్లో కిలో రూ.160 నుంచి రూ.180 ధరకు లభ్యమవుతున్నప్పటికీ.. రిటైల్గా రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నారు. దేశంలో గత రెండు నెలల నుంచి నిమ్మకాయల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. నిరుడు భారీ వర్షాలు కురవడం, తెగుళ్లు సోకడం, అధిక తేమ వల్ల పూత, కాయ రాకపోవడంతో ఈసారి నిమ్మ దిగుబడి పడిపోయిందని రైతులు చెప్తున్నారు.
షర్బత్ కరువయ్యే
ఎండా కాలంలో గరీబు నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో షర్బత్ తయారీకి ఎక్కువగా ఉపయోగించేది నిమ్మకాయలే. కానీ ప్రస్తుతం నిమ్మకాయ పేదోడి ఇంటికి రానంటున్నది. వీటి ధరలు భారీగా పెరగడంతో షర్బత్ లేక సామాన్యుల గొంతు ఎండుతున్నది. నిమ్మకాయల ధరలు యాపిల్ ధరను దాటేయడం, ఫలితంగా సోడా, లెమన్-టీ రేట్లు కూడా పెరగడంతో వినియోగదారులు షాకవుతున్నారు.