ముంబై: ఇండియన్ టెన్నిస్ను ఎక్కడికో తీసుకెళ్లిన ఘనత లియాండర్ పేస్, మహేష్ భూపతి జోడీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇద్దరూ కలిసి ఏకంగా 23 డబుల్స్ టైటిల్స్ గెలిచారు. 1999లో వింబుల్డన్ గెలిచిన తొలి ఇండియన్స్గా రికార్డు సృష్టించారు. అలాంటి జోడీ ఇప్పుడు మళ్లీ చేతులు కలుపుతోంది. అయితే ఈసారి జీ5 ఓటీటీ ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ ఏకం కానున్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన అన్టోల్డ్ స్టోరీని దంగల్ డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని నితేష్ తివారీయే ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
పేస్, భూపతితోపాటు తన భార్య అశ్విని అయ్యర్ తివారీతో ఉన్న ఫొటోను అతడు ట్విటర్లో పోస్ట్ చేశాడు. వాళ్ల టెన్నిస్ ప్రయాణం, ఇద్దరి మధ్య ఉన్న సంబంధాల గురించి ఈ అన్టోల్డ్ స్టోరీ మనకు వివరించనుంది. ఈ టెన్నిస్ లెజెండ్స్ స్టోరీని తెరకెక్కించడం చాలా గౌరవంగా బావిస్తున్నట్లు నితేష్ ఆ ట్వీట్లో చెప్పాడు.
ఈ మధ్యే వింబుల్డన్ విజయం సాధించి 22 ఏళ్లయిన సందర్భంగా ఆ ఫొటోను లియాండర్ పేస్ ట్వీట్ చేశాడు. 22 ఏళ్ల కిందట ఈ రోజు మేము వింబుల్డన్ గెలిచిన తొలి ఇండియన్స్గా నిలిచాము. యువకులుగా మా దేశానికి గర్వకారణంగా నిలవాలనే ఎప్పుడూ కలలు కన్నాము అని పేస్ కామెంట్ చేశాడు. దీనికి భూపతి కూడా స్పందిస్తూ.. అది చాలా స్పెషల్. ఇప్పుడు మరో చాప్టర్ను రాసే టైమ్ దగ్గర పడిందని నువ్వు అనుకుంటున్నావా అని కామెంట్ చేశాడు. అప్పుడే పరోక్షంగా ఈ ఓటీటీ ప్రాజెక్ట్ గురించి భూపతి వెల్లడించాడు.