హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పౌర్ణమి సందర్భంగా రథోత్సవం కనుల పండువలా సాగింది. జిల్లాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాలు.. గోవింద నామస్మరణల మధ్య రథోత్సవం కమనీయంగా జరిగింది. ఈ నెల 2 నుంచి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల తరహాలోనే ఇక్కడ సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి వాహనసేవలు జరుగుతుంటాయి.
ఇందులో భాగంగా ఆదివారం స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రథంపై పురవీధుల్లో విహరించారు. అంతకు ముందు ఆలయంలో హోమం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు రథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం సమయంలో రథోత్సవం నిర్వహించగా.. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జాతరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.