సిటీ క్రిమినల్ కోర్టులు, నాంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పోలీస్ అధికారులు కొందరు సీఆర్పీసీ 41(a) సెక్షన్ను దుర్వినియోగం చేస్తున్నారని శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాదులు తలపెట్టిన దీక్షకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల న్యాయవాద బార్ అసోసియేషన్లు మద్దతును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లి కోర్టులో దీక్షకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ దీక్షకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ సునీల్ గౌడ్ , బార్ కౌన్సిల్ సభ్యులు జితేందర్రెడ్డి, కొండారెడ్డి, చాలకాని వెంకట్ యాదవ్, భార్గవ్, గండ్ర మోహన్ రావు, అనంత్ సేన్ రెడ్డి, సత్యనారాయణ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అలాగే, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మధు శేఖర్, లింగం నారాయణ, ఫౌండర్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ కొంతం గోవర్ధన్ రెడ్డి, తెలంగాణ సామాజిక న్యాయ గ్రామీణాభివృద్ధి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్, కార్యదర్శి అబ్దుల్ ఖదీర్, తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మ తదితరులు తమ మద్దతును ప్రకటించారు.