26, 27న ఎడ్సెట్
షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
హైదరాబాద్, మార్చి 29 : పలు వృత్తివిద్యాకోర్సుల ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 2022 -23 విద్యాసంవత్సరానికి గాను జూలై 21, 22న లాసెట్ నిర్వహిస్తారు. జూలై 22న పీజీఎల్సెట్ (ఎల్ఎల్ఎం), 26, 27న ఎడ్సెట్ (బీఈడీ), 27, 28న ఐసెట్ (ఎంబీఏ, ఎంసీఏ), జూలై 29 నుంచి ఆగస్టు 1 వరకు పీజీఈసెట్ (ఎంటెక్, ఎంఫార్మసీ) పరీక్షలు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి వివరించారు. ఈ ప్రవేశ పరీక్షలన్నింటికి ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తు రుసుములను పెంచడంలేదని, పాత ఫీజులే కొనసాగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.