వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం మాట్లాడుతూ.. రైతు బీమా మాదిరిగా చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా అందేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
‘ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నం. ఆ దిశగా ప్రయాణిస్తున్నం. ఫలితాలు కనబడుతున్నయి. ఆ ఫలితాలు మన ముందరే కాదు యావత్ ప్రపంచం ముందు కూడా ఉన్నవని’ సీఎం కేసీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సిరిసిల్లలో సకల సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, సర్దాపూర్లో మార్కెట్యార్డు, గిడ్డంగులను, సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలను, మండేపల్లిలో ఐడీటీఆర్ శిక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు.
గడిచిన ఏడేండ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుతాలు జరిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మూలవాగుపై మరో 12 చెక్డ్యాంలు కట్టవచ్చని అధికారులు చెబుతున్నారని ఈ మేరకు వాటిని మంజూరు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూలవాగుపై 12 చెక్డ్యాంల నిర్మాణానికి సీఎం కేసీఆర్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు, ఇంజినీర్ కాలేజీ మంజూరు, రాజరాజేశ్వరి జలశాయం అభివృద్ధిలో భాగంగా టూరిజంశాఖకు 243 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింతకు ఆదేశించారు. కాగా మెడికల్ కాలేజీ మాత్రం వచ్చే విడతలో మంజూరు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా ఏడుగురు చనిపోయారు. 1,088 మంది పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,964గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్తో ఇప్పటి వరకు మొత్తం 3,691 మంది చనిపోయారు
ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ కాంట్రాక్టు లెక్చరర్లను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు హాజరైన ఆయన.. సీఎం కేసీఆర్ కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పే ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించారన్నారు. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ఉద్యోగులుగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా ఆదిలాబాద్లో భారీ ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ఒకే రోజు 10 లక్షల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు.
కృష్ణా జలాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలాంగాణ హక్కులను కేంద్రానికి దారాదత్తం చేయాలనట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాజకీయాలు మాని ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికి కలిసి రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడని ప్రతిపక్షాలు ద్రోహులుగా మిగిలిపోతారని మంత్రి హెచ్చరించారు.
తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 151 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి మల్టీజోన్ పోస్టులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
ప్రముఖ శ్రీశైల మల్లిఖార్జున స్వామి ఆలయ సన్నిధిలో గత నాలుగు రోజులుగా డ్రోన్ కెమెరాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రోన్లను ఎగురవేస్తున్న వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. శ్రీశైలం చుట్టూ ఉన్న నల్లమల అటవీ పరిసరాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే పుష్కర్సింగ్ ధామి ప్రమాణస్వీకారం చేశారు. డెహ్రాడూన్లోని రాజ్భవన్లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రులు సత్పాల్ మహరాజ్, హరాక్సింగ్ రావత్, ఇతర బీజేపీ నాయకులు హాజరయ్యారు.
రఫేల్ డీల్ వివాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కౌంటర్ వేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆదివారం ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను షేర్ చేస్తూ చోర్ కీ దాడీ (దొంగ గడ్డం) అంటూ కామెంట్ చేశాడు. ఆ ఫొటోలో రఫేల్ విమానం నుంచి వచ్చిన పొగ మోదీ గడ్డంలా కనిపిస్తోంది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించింది. తాజాగా 13 జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేసినట్లు ప్రకటించింది. ఈ 13 జిల్లాల్లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.
ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు, ఆ దేశ ప్రజలకు ప్రధాని మోదీ 245వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. మన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నదని ఆయన తెలిపారు.
కరోనా మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసన్ హెచ్చరించారు. ఇప్పటికీ ఇంకా ఏ దేశం ప్రమాదం నుంచి బయట పడలేదని గుర్తు చేశారు. డెల్టా వేరియంట్ ప్రమాదకరమైందని, వైరస్ కాల క్రమేణా మారుతున్నందున నిరంతరం దాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రపంచంలో ఎక్కువ శాతం మందికి కరోనా వ్యాక్సిన్ దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ నిలిచింది. బ్లూమ్బర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం.. యూఏఈలోని జనాభాలో 72.1 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇప్పటివరకు ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్న సీషెల్స్లో 71.7 శాతం మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు.
ఫిలిప్పీన్స్లో వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం కూలిపోయింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది జవాన్లు మృతి చెందారు. కాగా, హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్కు నైరుతి దిశలో ఓ ప్రైవేటు విమానం కూలి ఆరుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.