యాదాద్రిభువనగిరి, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒక ఆలోచన అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. సామాన్యులైనా.. తమకున్న పరిజ్ఞానంతో సరికొత్త ప్రయోగాలు చేయొచ్చని నిరూపించారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామానికి చెందిన ఎలమంద శివనాగరాజు. రైతులపై ఆర్థిక భారాన్ని, ఇంధన ఖర్చులను తగ్గించేందుకు శివనాగరాజు వినూత్న ఆలోచన చేశాడు. విద్యుత్తు చార్జింగ్తో నడిచే మినీ ట్రాక్టర్ను రూ.1.30లక్షల ఖర్చుతో రూపొందించాడు. ఈ ప్రయోగానికి స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ అంజలీమహిమాల్ ఆర్థిక సహాయమందించారు. ట్రాక్టర్ రూపకల్పనలో అతడి మిత్రబృందం అనూష, సౌమ్య, కృష్ణ, శ్రావణి, ప్రవళ్లిక, సింధు సహకరించారు. స్టార్టప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నానని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నాగరాజు కోరుతున్నాడు.
మినీ ట్రాక్టర్ ప్రత్యేకతలు
5 అడుగుల పొడవు, మూడున్నర అడుగుల వెడల్పు, రెండున్నర అడుగుల ఎత్తు, 157 కిలోల బరువుతో ట్రాక్టర్ను సిద్ధం చేశారు.
72వోల్ట్స్, 1500 వాట్స్ కలిగిన ఇంజిన్, 50 ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ట్రాక్టర్ను తయారు చేశారు.
యాక్సిలేటర్, బ్రేక్ మాత్రమే ఉండడం వల్ల ఈ ట్రాక్టర్ను మహిళలు సునాయసంగా నడపవచ్చు.
2 గంటలు చార్జింగ్ పెడితే 30 నుంచి 40 కి.మీ వరకు నడుస్తుంది.
ట్రాక్టర్పై 500 నుంచి 800 కిలోల వరకు వ్యవసాయ సంబంధిత సామగ్రిని తీసుకెళ్లవచ్చు.
తోటల మధ్య కలుపు మొక్కలను తొలగించడం, చెట్ల చుట్టూ పాదులు తీయడం, ఎరువులు వేయడం, నీరు పెట్టడం వంటి పనులను ఈ ట్రాక్టర్ ద్వారా చేయొచ్చు. అవసరమైతే ట్రాలీని అమర్చుకోవచ్చు.
సృజనాత్మకతకు అడ్డురాని పేదరికం
శివనాగరాజు తండ్రి ఎలమంద రాజు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. వీరి స్వస్థలం హైదరాబాద్లోని లింగంపల్లి. అక్కడి నుంచి నాగోలుకు వలసవచ్చి కొంతకాలం పాటు అక్కడే ఉన్న వీరి కుటుంబం ఏడాది క్రితమే దేశ్ముఖి గ్రామానికి వచ్చి స్థిరపడింది. శివనాగరాజు పదో తరగతి వరకు ఆంధ్రాలో చదివాడు. హైదరాబాద్లో ఇంటర్, డిగ్రీ పూర్తిచేశాడు. అతన్ని వెంటాడుతున్న పేదరికం..నూతన ఆవిష్కరణలకు ప్రతిబంధకం కాలేదు. గతంలోనూ అనేక ఆవిష్కరణలు చేసి అందరి మన్ననలు అందుకున్నాడు.
గత ఆవిష్కరణలు ఇవే
గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ సంఘటన సందర్భంలో అమ్మాయిలు, మహిళలకు ఆయుధంగా స్టన్ గన్ను తయారుచేశాడు. దీనికి ‘దండన’ అనే పేరు పెట్టారు. ఈ స్టన్ గన్ను ఉపయోగించినపుడు ఎదుటి వ్యక్తికి ఎలాంటి ప్రమాదం కలుగదు. కానీ కొంత సేపటి వరకు నిశ్చేష్టులను చేస్తుంది.
మహిళా పోలీసులకు ఎలక్ట్రిక్ లాఠీని కూడా తయారు చేసి ఆ శాఖ అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
ఎలక్ట్రిక్ బైక్ లాంటి అనేక ఆవిష్కరణలు శివనాగరాజు సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచాయి.
2021-22 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇంటింటా ఇన్నోవేషన్’ కార్యక్రమంలో ‘ఎలక్ట్రిక్ నెబ్యులేటర్ మాస్క్’ ఆవిష్కరణకు అత్యుత్తమ ప్రశంస వచ్చింది. జిల్లాస్థాయిలో ఈ ప్రదర్శన మూడో స్థానంలో నిలిచింది.