న్యూఢిల్లీ : గ్లోబల్ ఫార్మా మేజర్ దిగ్గజం ఫైజర్ అమెరికా, యూరప్, ఆసియాలోని పంపిణీ కేంద్రాల నుంచి 70 మిలియన్ డాలర్లు (రూ.510) కోట్లకుపైగా ఔషధాలను భారత్లోని కొవిడ్ ట్రీట్మెంట్ పోటోకాల్స్లో భాగంగా పంపనున్నట్లు కంపెనీ చైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా సోమవారం ప్రకటించారు. భారత ఉద్యోగులకు పంపిన మెయిల్లో విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా భారత్లో కరోనా విజృంభణపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటంలో భాగస్వాములయ్యేందుకు కట్టుబడి ఉన్నామని, కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద విరాళమని వెల్లడించారు.
ప్రస్తుతం యూఎస్, యూరప్ ఆసియాలోని పంపిణీ కేంద్రాల నుంచి ఔషధాలను వేగంగా పంపించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి కొవిడ్-19 రోగికి అవసరమైన మందులు ఉచితంగా పొందేలా విరాళంగా ఇస్తున్నట్లు బౌర్లా చెప్పారు. 70 మిలియన్ డాలర్ల కంటే విలువైన మందులు వెంటనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తామని ఫైజర్ కంపెనీ సీఈవో పేర్కొన్నారు.