హైదరాబాద్ : త్వరలోనే రాష్ర్టంలో సమగ్ర భూసర్వే చేపడుతామని, ఇందు కోసం బడ్జెట్లో రూ. 400 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వే జరపాలని ప్రభుత్వం గత సంవత్సరం నిర్ణయిచింది. ఈ సర్వే ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్బుక్లు అందించనున్నామని తెలిపారు. ఈ విధానం వల్ల రికార్డుల వక్రీకరణకు ఎంత మాత్రం అవకాశం ఉండదన్నారు. ఈ సర్వే వల్ల వ్యవసాయ భూముల హద్దులు మాత్రమే కాకుండా, దేవాలయ భూముల, వక్ఫ్ భూముల, అటవీ భూముల, ఇతర ప్రభుత్వ భూముల హద్దుల వివాదాలు కూడా పరిష్కారం అవుతాయన్నారు.
యాజమాన్య హక్కులపై స్పష్టత
రాష్ర్టంలో భూరికార్డుల ప్రక్షాళన వల్ల దాదాపు 95 శాతం భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చిందన్నారు. కొత్త పాస్ పుస్తకాలు రైతులకు అందాయి. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా 60 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించగలుగుతున్నామని పేర్కొన్నారు.
భూరికార్డులను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్ను రూపొందించిందని తెలిపారు. ధరణి భూపరిపాలనలో నూతన శకానికి నాంది పలికిందన్నారు. ఇప్పటి వరకు ధరణి పోర్టల్ను 2 కోట్ల 17 లక్షల మంది వీక్షించినట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 3 లక్షల 29 వేల లావాదేవీలు జరిగాయన్నారు. ఒక లక్షా 6 వేల పెండింగ్ మ్యుటేషన్లు పూర్తయ్యాయని తెలిపారు. రిజిస్ర్టేషన్, మ్యుటేషన్లలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని అధికారుల విచక్షాణాధికారాన్ని ప్రభుత్వం తొలగించిందని మంత్రి పేర్కొన్నారు.