పట్టించుకోని ఉద్యానవన శాఖ
ముషీరాబాద్, జూన్ 13: అడిక్మెట్ డివిజన్ రాంనగర్ లక్ష్మమ్మ పార్కు అభివృద్ధి పనులు పూర్తి చేసి యేడాది గడుస్తున్నా గ్రీనరీ ఏర్పాటు పనులు ముందుకుసాగడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు పార్కు అభివృద్ధి పనులు పూర్తి చేసి గ్రీనరీ ఏర్పాటుకు అవకాశం కల్పించినా ఉద్యాన వన శాఖ అధికారులు పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారు. లక్ష్మమ్మ పార్కులో గ్రీనరీ ఏర్పాటు కోసం నిధులు మంజూరైనా పనులు చేపట్టకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. గత యేడాది క్రితం లక్ష్మమ్మ పార్కును జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి చేశారు. రూ .9 లక్షలతో లక్ష్మమ్మ పార్కు చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు చేపట్డంతోపాటు పార్కు లోపల పాత్వే, వాకింగ్ టైయిల్స్ ఏర్పాటు చేశారు. అంతేకాదు పార్కు బయట వర్షం కురిసిన ప్రతిసారి పెద్ద ఎత్తున వరద నీరు ఉండటంతో వరద నీటి సమస్యకు సైతం పరిష్కారం చూపారు.
ప్రణాళిక సిద్ధ్దం చేసి యేడాది..
లక్ష్మమ్మ పార్కులో గ్రీనరీ ఏర్పాటు కోసం ఉద్యానవన శాఖ అధికారులు యేడాది క్రితం ప్రణాళిక సిద్ధం చేశారు. రూ 2.లక్షలతో పార్కులో పచ్చిక ఏర్పాటు, ఆట పరికరాలు, మొక్కలు నాటడం వంటివి చేయాలని ప్రతిపాదించారు. అయితే యేడాది కాలంగా అధికారులు పార్కు వైపు కన్నెత్తి చూడం లేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు లక్షలు వెచ్చించి చేపట్టిన పనులు ఎందుకుకొరగాకుండా పోతున్నాయి.
గ్రీనరీ పెండింగ్లో ఉంది..
జీహెచ్ఎంసీ చేపట్టాల్సిన పనులు అన్ని యేడాది క్రితమే పూర్తి చేయడం జరిగింది. పార్కు నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే గ్రీనరీ ఏర్పాటు, మొక్కలు నాటడం చేయాల్సిందిగా ఉద్యానవన శాఖ అధికారులకు సూచించాం.వారు చేపట్టాల్సిన పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నవి. -తిరుపతి, ఏఈ, జీహెచ్ఎంసీ