శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో జైష్టమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పూష్పార్చనలు చేసినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. గురువారం సాయంత్రం ప్రదోషకాల పౌర్ణమి గడియల్లో శ్రీ భ్రమరాంబ దేవికి లక్షకుంకుమార్చన, ఊయల సేవను నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాకారమంతా ప్రత్యేక పుష్పాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఊయలలో ఆశీనులైన స్వామి అమ్మవార్లకు అర్చక వేదపండితులు షోడశోపచార క్రతువులు జరిపి లలితా సహస్రనామ పఠనంతో కుంకుమార్చన చేశారు.
లోకకళ్యాణార్థం ప్రతి పౌర్ణమి రోజున మాత్రమే అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన పూజా విధిలో భక్తులు కూడా పరోక్షసేవ ద్వారా పాల్గొనే అవకాశం కల్పిస్తూ ప్రారంభించిన ఆర్జిత సేవలో గోత్రనామాలను అర్చకులు పఠించారు. దేశ విదేశాలలో ఉండే భక్తుల అభ్యర్థన మేరకు అమ్మవారికి జరిగే పౌర్ణమి ప్రదోషకాల పూజల్లో పరోక్షంగా పాల్గొనే అవకాశం కల్పించిన దేవస్థానం నిర్ణయానికి పలువురు దాతలు హర్షం వ్యక్తం చేసినట్లు ఈవో తెలిపారు. పూజా కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు మార్కండేయ శర్మ, వేదపండితుడు రాధాకృష్ణ, శాస్త్రి, ఫని, పవన్, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్ కుమార్ పాల్గొన్నారు.