గర్మిళ్ల(మంచిర్యాల) : జిల్లా కేంద్రంలో ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ పూర్తి వివరాలు వెళ్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లికి చెందిన తాళ్ళపల్లి ప్రసాద్, ధనలక్ష్మి కొన్నేండ్ల క్రితం విజయవాడలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం మంచిర్యాలకు తిరిగి వచ్చి ఇక్బాల్ అహ్మద్ నగర్లో రూమ్ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ధనలక్ష్మి గాజులు అమ్ముతుండగా, ప్రసాద్ మంచిర్యాల బస్టాండ్లో కూల్డ్రింక్స్ అమ్ముతూ జీవిస్తున్నారు. వ్యాపారంలో వచ్చే ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ప్రసాద్ తాళం వేసి ఉన్న ఇండ్లను పగలు సమయంలో గుర్తించేవాడు. రాత్రి వేళల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి తాళాలు పగులగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలను చోరి చేసేవారు. అయితే భార్య చోరీలకు పాల్పడుతుంటే.. భర్తేమో ఆ ఇంటి బయట కాపలా ఉండేవాడు. ఇటీవల స్థానిక మార్కెట్ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు వీరు అనుమానంగా కనిపించడంతో వారిని పట్టుకుని విచారించగా నేరాలు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.4 లక్షల విలువ గల బంగారు, వెండి ఆభరణాలు, రూ. 9 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ బీ నారాయణ, ఎస్ఐలు డీ కిరణ్కుమార్, ప్రవీణ్కుమార్, దేవయ్య, ఏఎస్ఐ వెంకన్న గౌడ్, హెడ్ కానిస్టేబుల్ దివాకర్, కానిస్టేబుల్ శ్రీనివాస్లు పాల్గొన్నారు.