జీపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు
సహకరించిన పల్లెప్రగతి నిధులు
ప్రజలకు చేరువైన సౌకర్యాలు
అందుబాటులో మౌలిక వసతులు
సంక్షేమంపైనే దృష్టి పెట్టిన పాలకవర్గం
విరాళాలతో సీసీ కెమెరాల ఏర్పాటు
ఆసిఫాబాద్, మార్చి 31: జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈదులావాడ అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. గ్రామంలో రూ. 12.60 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. ఇందులో స్నానాల గదులు, వెయిటింగ్ హాల్, బోరుబావి తదితర పనులు చేశారు. రూ. 6 లక్షలు వెచ్చించి ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. రూ. 2 లక్షలతో డంప్ యార్డు, రూ. 2.50 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు. ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రామం కావడంతో, ఇక్కడ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొమ్ముగూడలో రూ. 2.50 లక్షలతో సైడ్ డ్రైన్, ఈదులవాడలో రూ. 2.50 లక్షలతో సైడ్డ్రైన్, తెనుగుగూడలో రూ. 3 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, రూ.1 లక్షతో సైడ్ డ్రైన్ పనులు చేశారు. పంచాయతీ పరిధిలో సింగరావు పేట చెరువు కింద దాదాపుగా 400 ఎకరాల వరకు పంటలు సాగవుతున్నాయి. ప్రతి ఏడాది రెండు పంటలను రైతులు తీస్తున్నారు.
సంక్షేమంలో..
గ్రామ పంచాయతీ పరిధిలో 552 గృహాలు ఉండగా, 1823 మంది జనాభా ఉన్నారు. 2647 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, 1146 మంది రైతులున్నారు. వీరికి రూ. 1.33 కోట్లు రైతు బంధు ద్వారా ప్రతి సీజన్కు ప్రభుత్వం అందిస్తున్నది. 204 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. గ్రామంలో 41 స్వయం సహాయక సంఘాలుండగా, 280 మంది సభ్యులున్నారు. వీరు రూ. 35 లక్షల వరకు రుణాలు పొందారు.
విరాళాలతో సీసీ కెమెరాల ఏర్పాటు
గ్రామంలో 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ. 1 లక్ష వరకు ఖర్చు కాగా, గ్రామస్తులే విరాళాల ద్వారా రూ. 50 వేలు అందజేశారు. నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రామం ప్రశాంతతకు నిలయంగా మారింది.
ప్రజల సహకారంతోనే..
గ్రామ ప్రజల సహకారంతో పంచాయతీని అభివృద్ధి చేసుకుంటున్నాం. గ్రామంలో వ్యవసాయం పైన అధారపడిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నా యి. ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్ ఇక్కడి నుంచే ఎంపీటీసీ గెలువడంతో ఆయన గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా వివిధ పనులు చేపట్టి, సకాలంలో పూర్తి చేశాం. విరాళాల ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాం. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మించుకున్నాం. దశల వారీగా పనులను చేపడుతున్నాం. -బూసి భీమేశ్, సర్పంచ్
కొత్తరూపు వచ్చింది..
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులతో గ్రామానికి కొత్త రూపు వచ్చింది. ముఖ్యంగా ప్రకృతి వనంతో గ్రామానికే అందం వచ్చింది. గ్రామంలోకి ప్రవేశించే మార్గంలో ప్రకృతి వనం ఉండడంతో, ఆహ్లాదకరంగా కనిపిస్తున్నది. గ్రామ సంక్షేమానికి అందరం సహకరిస్తున్నాం. గతంలో ఇలాంటి అభివృద్ధి పనులు చూడలె. పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం శ్రద్ధ చూపడం ప్రజల అదృష్టం. -వాసం సంతోష్, గ్రామస్తుడు
కల్లాలతో రైతులకు మేలు..
ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ సారు వచ్చినంక రైతులకు మాత్రం చాలా చేస్తున్నడు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు రైతు భవనం, రైతులకు కల్లాలు కట్టించడం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలే. రైతులకు 24 గంటల కరంట్, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు సకాలం లో అందజేస్తున్నరు. ఇలా గతంలో ఏ ప్రభుత్వమూ పనిచేయలే. -టీ. సంతోష్, గ్రామస్తుడు
గ్రామం మారింది..
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మా గ్రామం పూర్తిగా మారింది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన వైకుంఠధామం, డంప్ యార్డు, సేంద్రియ ఎరువుల తయారీ.. ఇలా ప్రజలకు మేలు చేసే పనులు చేయడం బాగుంది. సీఎం కేసీఆర్ లాంటి నాయకుడితోనే ప్రజలకు మంచి జరుగుతున్నది. -చునార్కర్ సురేశ్, ఈదులవాడ