న్యూఢిల్లీ : ఆర్మీపై పట్టు కోసం ఆర్ఎస్ఎస్ ఎత్తుగడలో భాగంగానే అగ్నివీర్ స్కీంను తెరపైకి తెచ్చారని కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. అగ్నివీరులు ఆర్మీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలవుతారని, సర్వీసు ముగిసినా వారు సంఘ్ కార్యకర్తలుగానే ఉంటారని వ్యాఖ్యానించారు.
అగ్నివీరులను ఆర్ఎస్ఎస్ నేతలు నియమిస్తారా..సైనికాధికారులు నియమిస్తారా అని కుమారస్వామి ప్రశ్నించారు. పది లక్షల మంది అగ్నివీరుల్లో 2.5 లక్షల మంది సైన్యంలో కొనసాగుతారని రూ 11 లక్షలతో బయటకువచ్చే75 శాతం మంది దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ విస్తరణకు పాటుపడతారని అన్నారు. సైన్యం లోపల, వెలుపల ఉన్నవారంతా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలేనని, సైన్యాన్ని ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఉంచాలన్నది కాషాయ పాలకుల ప్రణాళికని కుమారస్వామి దుయ్యబట్టారు.
జర్మనీలో హిట్లర్ నాజీ పాలన సమయంలోనే ఆర్ఎస్ఎస్ పురుడు పోసుకుందని అన్నారు. నాజీ పాలన ఇక్కడ అమలు చేసేందుకే వారు అగ్నివీరులను తీసుకువస్తున్నారని ఆరోపించారు. భారత్లో నాజీ ఉద్యమాన్ని తీసుకువచ్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ అజెండాతోనే అగ్నిపథ్ పధకం తీసుకువచ్చారని మండిపడ్డారు.