కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 26 : ఇంటింటికి చెత్తను సేకరించేందుకు వార్డుల వారీగా మ్యాపింగ్ను సిద్ధం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. సోమవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో పారిశుధ్య,ం చెత్త తరలింపు, స్వచ్ఛ ఆటోల మ్యాపింగ్, ఇంటింటికి చెత్త సేకరణ, చెత్త తరలింపు వాహనాలు, తరచుగా చెత్తవేసే ప్రాంతాలు, స్వచ్ఛ టాయిలెట్స్, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై ఉప కమిషనర్లు సంబంధిత అధికారులతో జడ్సీ మమత సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీలలో పరిసరాలను పరిశుభ్రంగా మార్చడంలో భాగంగా డస్ట్బిన్లను తొలగించిన ప్రాంతాలలో చెత్త పడకుండా చూడాలన్నారు. తరచుగా చెత్త వేస్తున్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు, వ్యాపారులు ఆ ప్రాంతంలో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలన్నారు. ప్రజల్లో మార్పు రాకుంటే భారీ జరిమానాలు విధించాలన్నారు. జీవీపీ పాయింట్లలో ప్రతిరోజూ చెత్తను తొలగించాలన్నారు.
ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తున్న స్వచ్ఛ ఆటోల వివరాలు ఇండ్లకు సంబంధించిన వివరాలతో మ్యాపింగ్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంటింటికి చెత్త సేకరణను మెరుగు పర్చడానికి ప్రత్యేక యాప్ను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. వార్డులు, కాలనీలు, బస్తీలు, ఇండ్లు, కుటుంబాల వివరాలను సేకరించాలన్నారు. తదనంతరం ఆ వార్డుల వారీగా డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక యాప్ను ఈనెల 30 లోగా సిద్ధం చేయాలన్నారు.
జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలోని ప్రతి వార్డుకు ఒకటి సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కనీసం సర్కిల్కు మూడు చొప్పున సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చి చెత్తను ఎప్పటికప్పుడు శివారు ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చెత్తను తరలించే వాహనాలపై నిరంతరం నిఘా పెట్టాలని పరిస్థితులకనుగుణంగా ట్రిప్పుల సంఖ్యను పెంచి పూర్తిస్థాయిలో చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాలు, డ్రైవర్ల హాజరు, చెత్త తరలింపు విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. చెత్తను తరలించే వాహనాలకు వివరాలను సూచించే స్టిక్కర్లను అతికించాలని ఆదేశించారు.
ట్రేడ్ లైసెన్స్ రుసుము వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టినిసారించాలన్నారు. ఇప్పటి వరకు ట్రేడ్ లైసెన్స్పై రెన్యూవల్ చేసుకోనివారిని గుర్తించి నోటీసులు అందించాలని స్పందించకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన దుకాణాలు, వ్యాపారాలపై దృష్టిసారించి కొత్త ట్రేడ్ లైసెన్స్లను జారీ చేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్లు కె.రవికుమార్, వి.ప్రశాంతి, రవీందర్కుమార్, మంగతాయారు, యాదయ్య, ఏఎంహెచ్వోలు, సీటీవోలు, డిప్యూటీ సీటీవోలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.