హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఆత్మ నిర్భర్ భారత్కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించగా.. ప్రధాని మోదీ.. భారత్కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారని.. ఇదేనా మీ ఆత్మ నిర్భర్ భారత్ ..? మీరు చెప్పే వోకల్ ఫర్ లోకల్ ఇదేనా? అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఖాదీ, చేనేత వస్ర్తాలపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారని విమర్శించారు.
చేనేతల కోసం ఎన్పీఏ చేసింది ఏంటి..?
బీజేపీ చేసిన పోరాట ఫలితమే చేనేత బీమా అని, అది ఆలస్యం కావడానికి కేటీఆర్ కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గంలోని సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను మంజూరు చేయలేని ఎంపీ (సంజయ్) వేసిన ఈ జోక్కు మంచి స్పందన వస్తుంది. బండి సంజయ్కుమార్ గత 8 సంవత్సరాలలో తెలంగాణలో చేనేత కార్మికుల కోసం ఎన్పీఏ (నిరర్ధక) ప్రభుత్వం ఏం చేసిందో నువ్వు మాకు ఎందుకు చెప్పడం లేదు? కరీంనగర్ ఎంపీగా నువ్వు ఏం చేశావో చెప్పడంలేదు’ అంటూ చురకలు అంటించారు.
పింగళి వెంకయ్యకు నివాళి..
జాతీయ జెండా రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. “75 ఏండ్లుగా స్వతంత్ర భారతావని సగర్వంగా ఎగురేస్తున్న మువ్వన్నెల జెండా రూపకర్త. స్వాతంత్య్ర సమరయోధులు, తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి” అని ట్వీట్ చేశారు.