హైదరాబాద్, జనవరి1: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన గొప్ప మనసు చాటుకున్నారు. అంతర్జాతీయ టోర్నీలో పోటీపడేందుకు డబ్బుల్లేవంటూ ఓ యువ కరాటే ప్లేయర్ చేసిన అభ్యర్థనకు మంత్రి తక్షణం స్పందించారు. వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బొలుగుల చందు.. ఐదో అంతర్జాతీయ నేపాల్ గేమ్స్లో బరిలోకి దిగాల్సింది. అయితే నేపాల్ వెళ్లేందుకు కావాల్సిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో సమస్యను ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే స్పందించిన మంత్రి టోర్నీకి వెళ్లేందుకు రూ.25 వేలు సమకూర్చారు. వరంగల్లోని సైనిక్ కాలేజీలో ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న 19 ఏండ్ల చందు తాను పోటీకి దిగిన కుంగ్ఫూ లో స్వర్ణ పతకంతో సత్తాచాటాడు.
శనివారం జరిగిన ఫైనల్లో కొరియా ప్లేయర్పై చందు 5-4 తేడాతో అద్భుత విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో భూటాన్ ప్లేయర్పై 5-3, సెమీఫైనల్లో నేపాల్ ప్లేయర్పై 5-3తో విజయాలు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన చందు.. పసిడి పతకం దక్కించుకోవడంపై మాట్లాడుతూ..‘మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు. ఆయన చేసిన ఆర్థిక సాయం వల్లే నేపాల్కు వెళ్లగలిగాను. కచ్చితంగా రాణిస్తానన్న నమ్మకంతో బరిలోకి దిగాను. దేశం గర్వపడేలా పసిడి పతకంతో మెరువడం సంతోషంగా ఉంది’ అని అన్నాడు. గోవాలో జరిగిన జాతీయ టోర్నీలో రాణించడం ద్వారా నేపాల్ చాంపియన్షిప్నకు ఎంపికయ్యాడు. ఎనిమిదో ఏటనే కరాటేను ఎంచుకున్న చందు..మాస్టర్ శ్రీను శిక్షణలో రాటుదేలాడు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా చందు పేర్కొన్నాడు.