గౌడన్నలకు త్వరలో మోపెడ్లను ఇచ్చే బాధ్యత మాదే. యాదవులకు గొర్రెలను, ముదిరాజ్లకు చేపల చెరువులు, మోపెడ్లు, వలలు, పద్మశాలీలకు నూలుమీద సబ్సిడీ, పొదుపు పథకంలో వాటా ఇస్తున్నట్లుగానే గౌడన్నలకు కూడా రానున్న రోజుల్లో సాయం అందజేస్తాం. దళితబంధు పథకాన్ని సమాజంలో అట్టడుగున ఉన్న దళితులతో ప్రారంభించాం. భవిష్యత్తులో ప్రతి ఒక్కొక్కరికీ ఇదే తరహాలో న్యాయం చేస్తాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులవృత్తులు ధ్వంసమైతే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. యాభై ఏండ్లు పైబడిన 70వేల మంది గీత కార్మికులకు నెలనెలా 2వేల పింఛన్ అందిస్తున్నాం. దేశంలో మరెక్కడా ఈ తరహా సాయం లేదు. ప్రమాదవశాత్తు గీత కార్మికుడు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తున్నాం. పది రోజుల్లోనే సాయమందేలా నిబంధనలను మరింత సులభతరం చేస్తాం. గౌడన్నలకు వైన్స్ దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించాం. సొసైటీలకు అవకాశం కల్పించి ఎక్కువమంది లబ్ధిపొందేలా సవరణల కోసం సీఎం కేసీఆర్తో చర్చిస్తాం. – మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఓబీసీ మంత్రిత్వశాఖను ఎందుకు ఏర్పాటుచేయడంలేదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘మోదీ ప్రభుత్వంలో ఇప్పటివరకు బలహీనవర్గాలకు మంత్రిత్వశాఖనే లేదు. బీజేపీలో ఓబీసీ మోర్చా ఉన్నది. దానికి మన రాష్ర్టానికి చెందిన నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ కన్వీనర్గా ఉన్నడు. పార్టీలో ఓబీసీ విభాగం ఉన్నప్పుడు.. మరి ప్రభుత్వంలో ఎందుకు ఓబీసీశాఖ ఉండదు?’ అని కేటీఆర్ నిలదీశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఆదివారం జరిగిన గౌడ ఆత్మీయసమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఓబీసీ శాఖ ఉన్నదని.. మరి కేంద్రంలో ఎందుకు ఆ శాఖను ఏర్పాటుచేయరని, ఇదేం నీతి.. అని ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రంలో ఓబీసీ శాఖను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సుదీర్ఘకాలంగా పోరాడుతున్నది. 2004 డిసెంబర్ 18న కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు.. ఆర్ కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్లను వెంటబెట్టుకుని స్వయంగా ప్రధానమంత్రి దగ్గరకు తీసుకుపోయి మంత్రిత్వశాఖ ఏర్పాటుపై గంటన్నరపాటు మాట్లాడారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉన్నప్పుడే దేశంలో 50 శాతానికి పైగా ఉన్న బలహీనవర్గాలకు లాభం చేకూరుతుందన్నది కేసీఆర్ నిశ్చితాభిప్రాయం’ అని కేటీఆర్ గుర్తుచేశారు. మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయలేని బీజేపీ.. బలహీన వర్గాల సంక్షేమాన్ని ఏం పట్టించుకుంటుందని విమర్శించారు. బలహీన వర్గాలపై బీజేపీకి ఉన్నది కపట ప్రేమనా, వారు కార్చేది మొసలి కన్నీళ్లా అనేది ప్రజలే ఆలోచించాలని కేటీఆర్ కోరారు. పిచ్చి మాటలు, గబ్బు పనులు తప్పితే ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన మంచిపని ఒక్కటైనా లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క మంచిపని చేయనోడు.. ఒక్క పథకం ఇవ్వనోడు.. 8 ఏండ్లలో కనీసం ఏం పనిచేసినవంటే చెప్పచేతగానోళ్లు రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రం ఏవేవో మాట్లాడుతున్నరని కేటీఆర్ మండిపడ్డారు.
గౌడన్నలకు బరాబర్ చేస్తున్నం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులవృత్తులు ధ్వంసమైతే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి కులవృత్తికి న్యాయంచేసే దిశగా సంక్షేమ కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. గౌడన్నలకు కూడా ఎన్నో మంచి పనులు చేశామని అన్నారు. రాష్ట్రంలో 2,29,852 మంది గీతకార్మికులు ఉండగా.. టీఎస్టీలో 4,181 మంది, టీఎఫ్టీల్లో 3,559 మంది సభ్యులుగా కొనసాగుతున్నారని తెలిపారు. యాభై ఏండ్లు పైబడిన 70వేల మంది గీత కార్మికులకు నెలనెలా 2వేల పింఛన్ అందిస్తున్నామని, దేశంలో మరెక్కడా ఈ తరహా సాయం అందడం లేదని కేటీఆర్ వివరించారు. గీత కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తున్నామని.. పది రోజుల్లోనే సాయమందేలా నిబంధనలను మరింత సులభతరం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4,092 మంది గీతవృత్తి దారుల కుటుంబాలకు దాదాపు రూ.30 లక్షలను నష్టపరిహారంగా అందజేసినట్టు వివరించారు. గౌడన్నలకు వైన్స్ దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించామని, సొసైటీలకు అవకాశం కల్పించి ఎక్కువమంది లబ్ధిపొందేలా అవసరమైన సవరణల కోసం సీఎం కేసీఆర్తో చర్చిస్తామని కేటీఆర్ హామీఇచ్చారు. చెట్ల పన్నును రద్దు చేసిన ఏకైక రాష్టంగా తెలంగాణ నిలుస్తుందని, గతంలో ఉన్న రూ.16 కోట్ల పాత బకాయిలను రద్దు చేయడంతోపాటు 8 కోట్ల రూపాయల కల్లుగీత రకం పాత బకాయిలను కూడా రద్దు చేశామని కేటీఆర్ తెలిపారు. 2019లో నీరా పాలసీని తేవడంతోపాటు మూతబడిన కల్లు డిపోలను తెరిపించి.. హైదరాబాద్ చుట్టూ ఉన్న నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా గౌడన్నలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడిందని కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో కల్లుగీత లైసెన్సుల రెన్యూవల్ను పదేండ్లకు పెంచామని తెలిపారు. హరితహారంలో 5 కోట్ల తాటి, ఈత, ఖర్జూర మొక్కలను ప్రతి గ్రామ పంచాయతీలో, చెరువుగట్లమీద నాటించామని పేర్కొన్నారు. 2019లో నీరా పాలసీని తెచ్చి ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
త్వరలో మోపెడ్లు అందజేస్తాం
గౌడన్నలకు త్వరలో మోపెడ్లను ఇచ్చే బాధ్యత తమదేనని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. యాదవులకు గొర్రెలను, ముదిరాజ్లకు చేపల చెరువులు, మోపెడ్లు, వలలు, పద్మశాలీలకు నూలుమీద సబ్సిడీ, పొదుపు పథకంలో వాటా ఇస్తున్నట్లుగానే గౌడన్నలకు కూడా రానున్న రోజుల్లో సాయం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ మనసే కాదు.. ఆలోచన కూడా పెద్దదని అన్నారు. దళితబంధు పథకాన్ని సమాజంలో అట్టడుగున ఉన్న దళితులతో ప్రారంభించారని, భవిష్యత్తులో ప్రతి ఒక్కొక్కరికీ ఇదే తరహాలో న్యాయం చేస్తామని మాటిచ్చారు. భవిష్యత్తులో అన్ని వర్గాలకు సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. 978 గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి 5 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన చదువును అందిస్తున్నామని.. ఉన్నత చదువుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట విదేశీ విద్య కోసం రూ.20 లక్షలను అందించి తోడ్పాటును అందిస్తున్నామని కేటీఆర్ వివరించారు. ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, ప్రకాశ్గౌడ్, బాల్క సుమన్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, తెలంగాణ గౌడ సంఘం నేతలు పల్లె లక్ష్మణ్గౌడ్, బాలగోని బాలరాజుగౌడ్, నారాయణగౌడ్, పల్లె రవి కుమార్, వెంకన్నగౌడ్, మెలికట్టె విజయ్కుమార్ గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, వేములయ్య గౌడ్, బబ్బూరి భిక్షపతిగౌడ్, రాజేంద్రప్రసాద్గౌడ్, హన్మంతు వెంకటేశంగౌడ్, శ్రీనాథ్గౌడ్, రామకృష్ణగౌడ్, యాదగిరిగౌడ్, కీర్తిలత గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, మహేష్గౌడ్ పాల్గొన్నారు.
అక్కడ కడుపుమీద తన్ని.. ఇక్కడ కమ్మటి మాటలా?
కర్ణాటక రాష్ట్రంలో.. ఎక్కడైతే భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్నదో.. అక్కడ ప్రభుత్వం మీ వృత్తిని బ్యాన్ చేస్తూ.. కల్లు గీయడాన్నే బ్యాన్చేస్తూ జీవో విడుదల చేసింది. మరి గిసోంటోళ్లకు, మొసలి కన్నీరు కారుస్తూ, వృత్తిమీద, కడుపు మీద దెబ్బ కొట్టేటోళ్లను ఆదరిద్దామా ఆలోచించండి. నేను చెప్తున్నది కహానీ కాదు. కర్ణాటకలో గౌడ్లను ఈడిగలంటరు. నేను చెప్పేది కాకమ్మ కబుర్లు కాదు. అక్కడ ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి నేతృత్వంలో అక్కడ రోడ్లమీదకు వచ్చి ధర్నా చేస్తున్నరు.జూన్ 19 డెడ్లైన్ పెట్టిన్రు. బీజేపీ ప్రభుత్వం ఈడిగలకు వృత్తి మీద, కడుపు మీద కొడుతున్నది.. వెంటనే భారతీయ జనతాపార్టీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన్రు. ఇక్కడనేమో తియ్యటిపుల్లటి మాటలు మాట్లాడతరు. అక్కడనేమో కడుపు కొడతరు. ఒక ఈడిగ సోదరుడు ఆమరణ దీక్ష చేస్తున్నడు. కర్ణాటకలో తాటిచెట్టు ఎక్కి ఆమరణ దీక్ష చేస్తున్నడు. మా కడుపుమీద కొట్టిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దీక్ష చేస్తున్నడు. మాటలొకతీరుగ ఉంటయి. చేసే పనులు ఇంకోతీరుగ ఉంటయి.
క్యాబినెట్లో ప్రత్యేకంగా మంత్రిత్వ విభాగం పెట్టాలి
గౌడలకు భరోసా కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే
గత కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు గీయడాన్ని రద్దుచేస్తే తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించి గౌడన్నలకు భరోసా కల్పించింది. నీరా కేఫ్గా ఏర్పాటు చేసి గౌడన్నలకు మరింత ఉపాధి కల్పించింది. ఫించన్, ఎక్స్గ్రేషియా వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తూ సీఎం కేసీఆర్ కొండంత అండగా ఉంటున్నరు. కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి గౌడన్నలు అండగా నిలవాలి.
– శ్రీనివాస్గౌడ్ , రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి
కేసీఆర్తోనే కల్లుగీత కార్మికుల జీవితాల్లో వెలుగు
కల్లుగీత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో మూతపడిన 103 సొసైటీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రీఓపెన్ చేయడం ద్వారా సుమారు 3 లక్షల మంది కార్మికుల కుటుంబాలకు ఉపాధి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం అడ్డాపన్నును రద్దు చేయడం ద్వారా కల్లుగీత కార్మికులకు ప్రతి సంవత్సరం 16 కోట్లు మిగులుతున్నాయి. అంతేగాక కోకాపేటలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 5 కోట్లు మంజూరు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంతో గౌడన్నలు ఎప్పటికీ కలిసే ఉంటారు.
– పల్లె లక్ష్మణ్గౌడ్, తెలంగాణ గౌడసంఘం
గౌడన్నలకు వెన్నుదన్నుగా ప్రభుత్వం
టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని గౌడన్నలకు వెనుదన్నుగా ఉంటుంది. గత ప్రభుత్వాలు గౌడన్నలను అన్నివిధాలా వాడుకొని వారి అభ్యున్నతికి ఎలాంటి చర్యలనూ తీసుకోలేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లతో నీరా ప్రాజెక్ట్ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. 4 కోట్ల ఈత, తాటి మొక్కలను నాటారు. గౌడన్నల అత్మగౌరవాన్ని మరింత ఇనుమడించేలా సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారంగా నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్కు మాత్రమే దక్కుతుంది. గౌడ సమాజం అంతా కేసీఆర్ వెంటే ఉంటారు.
– కేపీ వివేకానంద గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
తెలంగాణ ఉద్యమంలో గౌడన్నల పాత్ర ఎంతో ఉంది
తెలంగాణ ఉద్యమంలో గౌడన్నల పాత్ర ఎంతో కీలకమైనది. ఆనాటి నుంచీ గౌడన్నలు టీఆర్ఎస్ వెన్నంటే ఉన్నారు. 300 ఏండ్లుగా ఉన్న చెట్టు పన్నును రద్దు చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. అన్నివిధాలా ఆదుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నంటే ఉండి, గౌడన్నలు మరిన్ని సంక్షేమ ఫలాలను పొందాలి.
– పల్లె రవికుమార్, సీనియర్ జర్నలిస్ట్
గౌడన్నల చరిత్రను ప్రపంచానికి తెలిపింది టీఆర్ఎస్
అన్నివిధాలా గౌడన్నల సమస్యలను పరిష్కరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ముందుకుసాగుదాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములమవుదాం.
– వట్టికూటి రామారావు గౌడ్, జైగౌడ సంఘం ఆలిండియా అధ్యక్షుడు
టీఆర్ఎస్తోనే గౌడన్నలకు మరిన్ని పథకాలు
రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆదుకొంటున్న సీఎం కేసీఆర్ గౌడన్నల కొరకు మరిన్ని పథకాలను అమలు చేయాలి. ఇప్పటికే నష్టపరిహరాన్ని రూ.5లక్షలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని రైతుబీమా మాదిరిగా పదిరోజుల్లోనే బాధిత కుటుంబాలకు అందజేయాలి. రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమం జరగాలి అంటే అది సీఎం కేసీఆర్తోనే సాధ్యం. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశం అంతటా అమలయ్యే రోజు రావాలి.
– స్వామిగౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు
75 ఏండ్ల తర్వాత గౌడన్నలకు వైన్స్లలో 15 శాతం రిజర్వేషన్ కల్పించిన చరిత్ర సీఎం కేసీఆర్ది. గౌడన్నలను అన్నివిధాలా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ వెంట చివరి శ్వాస వరకు ఉంటాము.
– బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే
టీఆర్ఎస్ ప్రభుత్వంతో గీత వృత్తికి నూతనోత్సాహం
టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుతో కల్లుగీత కార్మికులకు వృత్తి నూతనోత్సాహం లభించింది. ముఖ్యంగా ప్రభుత్వం నష్టపరిహారం 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం ద్వారా కుటుబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
– అయిలి వెంకన్న, కల్లుగీత వృత్తిదారుల సంఘం నాయకులు