హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం సమావేశం కానున్నది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జలసౌధలో ఉదయం జరగనున్న భేటీకి బోర్డు ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. వాస్తవానికి సమావేశం ఈ నెల 27న జరుగాల్సి ఉండగా.. బోర్డు సెప్టెంబర్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే సమావేశంలో చర్చించేందుకు 14 అంశాలతో కేఆర్ఎంబీ ఎజెండా తయారు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా ఖరారు, ఇతర అంశాలే ప్రధాన ఎజెండాగా కీలక సమావేశం జరగనుంది. 2021-22 నీటి సంవత్సరానికి కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు వాటా విషయమై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
విభజన జరిగినప్పటి నుంచి తాత్కాలిక అవగాహన మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 34, 66 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగం జరుగుతోంది. అయితే, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, తదనంతర పరిణామాల నేపథ్యంలో కృష్ణా జలాల్లో దశాబ్దాలుగా తీవ్ర అన్యాయం జరుగుతోందని.. న్యాయపరమైన నీటికేటాయింపులు జరిగే వరకు నీటిని చెరిసగం వినియోగించుకోవాలని తెలంగాణ ప్రతిపాదించింది. ఇదే విషయాన్ని కృష్ణా బోర్డుకు కూడా తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్ తమ వాటా పెంచాలని కోరుతోంది. 70:30 నిష్పత్తిలో నీటిని వినియోగించుకోవాలని అంటోంది. కృష్ణా జలాల్లో వాటా పెంచాలని రెండు రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో భేటీలో ఈ అంశంపై చర్చ జరగనుంది.
అలాగే ఏడాది కేటాయించిన వాటాలో మిగిలిన జలాలను మరుసటి ఏడాదికి లెక్కించాలన్న తెలంగాణ ప్రతిపాదన, వరద వచ్చినపుడు నీటి వినియోగం, తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలు, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు, వాటి డీపీఆర్లు ఇవ్వడం, చిన్ననీటివనరులకు నీటి వినియోగం, ఏపీ గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తున్నందున 45 టీఎంసీలు అధికంగా ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తి, బోర్డు నిర్వహణకు సంబంధించిన అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. వీటితో పాటు బోర్డు తరలింపు అంశం సైతం చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన అంశంతో పాటు రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాలు కూడా కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకు రానున్నాయి. అటు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై బుధవారం సాయంత్రం రెండు బోర్డుల సంయుక్త సమావేశం జరగనుంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగే సమావేశంలో రెండు బోర్డుల సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొననున్నారు.