హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): నదీ జలాలను మిగులు ఉన్న (సర్ప్లస్) బేసిన్ నుంచి మళ్లించవచ్చు కానీ.. లోటు బేసిన్ నుంచి మళ్లించకూడదని కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ తరఫు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్పండిత్ నొక్కి చెప్పారు. రక్షణ హక్కుల కన్నా, బేసిన్లోని నీటి ప్రాధాన్యతలనే ముందుగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంచేశారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్-2 విచారణ బుధవారం ఢిల్లీలో ప్రారంభమైంది. మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ విచారణలో తొలిరోజు తెలంగాణ తరఫున చేతన్ పండిట్ను ఏపీ సీనియర్ న్యాయవాది వెంకటరమణి క్రాస్ ఎగ్జామిన్ చేశారు.
ఆపరేషన్ ప్రొటోకాల్పై ఏపీ లేవనెత్తిన అనేక అభ్యంతరాలకు చేతన్ పండిట్ దీటుగా సమాధానమిచ్చారు. ట్రిబ్యునల్ 1, 2 అవార్డుల మేరకు విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం అపరేషన్ ప్రొటోకాల్స్ను రూపొందించినా కూడా అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడలేదని వివరించారు. ప్రస్తుతం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆపరేషన్ ప్రొటోకాల్ను తిరిగి రూపొందించాల్సి అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. రివర్ బేసిన్లో ఉన్న తెలంగాణలో పెద్దమొత్తంలో సాగుకు యోగ్యమైన భూమి ఉన్నదని, అందుకు నీటి వనరుల అభివృద్ధి అవసరమని చెప్పారు. అందుకు భిన్నంగా బేసిన్ అవతలికి పెద్దమొత్తంలో నీటి మళ్లింపు కొనసాగుతూనే ఉన్నదని పేర్కొన్నారు. బేసిన్ నీటి అవసరాలు తీరిన తరువాతే నీటిని బేసిన్ అవతలికి తరలించాలని, అదే ప్రాథమిక సూత్రమని చెప్పారు. విచారణకు తెలంగాణ ఇంటర్ స్టేట్ వాటర్ బోర్డు సీఈ మోహన్కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు, ఈఈ విజయ్కుమార్ హాజరయ్యారు.