సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతి శెట్టి నాయికగా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్మార్క్ స్టూడియోస్ పతాకాలపై బి మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు. వినూత్న ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మీరే హీరోలా..’ లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హను రాఘవపూడి అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయిక కృతి శెట్టి మాట్లాడుతూ…‘ఈ పాటను మీడియా మిత్రుల చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ క్యారెక్టర్ చేయగలను అనే నమ్మకాన్ని నాలో కలిగించారు దర్శకుడు మోహన కృష్ణ. సుధీర్ బాబు ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారు. ఆ అమ్మాయి గురించి మేము సెప్టెంబర్ 16న చెబుతాం. వినేందుకు సిద్ధంగా ఉండండి’ అని చెప్పింది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ…‘మీడియా, హీరోకు మధ్య ఒక ఇంటర్వ్యూ తరహాలో సాగే పాట ఇది.
రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యాన్ని అందించగా…వివేక్ సాగర్ ఆకట్టుకునేలా స్వరపర్చారు. ఈ పాటలో చమత్కారం, ఎత్తిపొడుపు, చిన్న సంఘర్షణ ఉంటాయి. సరికొత్త ప్రేమ కథగా భావోద్వేగాలతో సాగుతుందీ సినిమా’ అన్నారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ..‘కథకు న్యాయం చేసే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో పనిచేయడం ఆనందంగా ఉంది.
కృతి శెట్టి ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో స్థిరపడిపోతుంది. మహేష్ బాబు సినిమాలో ఉన్నంత రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ చిత్రంలో కనిపిస్తాయి. లవ్, ఫ్యామిలీ డ్రామాగా మిమ్మల్ని మెప్పించే చిత్రమవుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి, చిత్ర సమర్పకులు గాజులపల్లె సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.