అమరావతి : కేంద్ర మాజీ మంత్రి , ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణం అభిమానులకు, జిల్లా ప్రజలకు తీరని లోటని ఏపీ మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు, కారుమూరి నాగేశ్వర్రావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరులో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభలో వారు పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
కృష్ణంరాజు భౌతికంగా దూరమైనప్పటికీ ప్రాంత ప్రజలకు చేసిన మేలును ఎవరూ మరచిపోరని మంత్రులు అన్నారు. కృష్ణంరాజు సినిమాల్లో రెబల్స్టార్ అయితే రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని పేర్కొన్నారు. సినీ రంగానికి కృష్ణంరాజు చేసిన సేవలకు గుర్తుగా మొగుల్తూరు తీరప్రాంతంలో రెండు ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రకటించారు.