కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తికి కొరియా సంస్థ సిద్ధం
కేటీఆర్, ఎర్రబెల్లితో కాన్ఫరెన్స్లో యంగ్వన్ చైర్మన్ సుంగ్ వెల్లడి
12 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆరునెలల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ద్వారా ‘మేడ్ ఇన్ తెలంగాణ వస్ర్తాలు’ మార్కెట్లోకి రానున్నాయి. దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ వస్త్ర ఉత్పత్తి సంస్థ యంగ్వన్ త్వరలోనే తమ ఉత్పత్తులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. కర్మాగారం పనులు మరో ఆరునెలల్లో పూర్తికానుండటంతో ఆ వెంటనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని సంస్థ చైర్మన్ కీహక్ సుంగ్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు కే తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్రావు, పరిశ్రమలశాఖ ముఖ్య అధికారులతో సుంగ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. గతంలో ప్రకటించిన విధంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడి ప్రణాళిక కొనసాగిస్తామని తెలిపారు. మొదటి దశలో ఐదు, రెండో దశలో మూడు యూనిట్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మొదటి దశ యూనిట్లు వచ్చే ఆరునెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తాయని వెల్లడించారు. కరోనా కారణంగా ఉత్పత్తి ఆలస్యమైందని, వరంగల్ కేంద్రంగా భారత్లో తాము కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. తమకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా బాసటగా నిలుస్తున్నదని తెలిపారు.
దేశ వస్త్రరంగంలో మైలురాయి: కేటీఆర్
ప్రపంచ దిగ్గజ టెక్స్టైల్ కంపెనీ యంగ్వన్ వరంగల్లో కర్మాగారాన్ని ఏర్పాటుచేయడం తెలంగాణలోనే కాకుండా భారతదేశ వస్త్రరంగంలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. యంగ్వన్లాంటి భారీ కంపెనీ వచ్చిన తర్వాత వరంగల్ టెక్స్టైల్ పార్కులో మరిన్ని కొరియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ధీమా వ్యక్తంచేశారు. యంగ్వన్ కర్మాగారాల నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సుంగ్కు మంత్రి హామీ ఇచ్చారు. కంపెనీ నిర్మాణం పూర్తయ్యాక 12 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నందున వరంగల్ ప్రజలకు ఉపాధి లభించేలా చర్యలు చేపట్టాలని వరంగల్ ఇంచార్జి మంత్రి కూడా అయిన గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కేటీఆర్ సూచించారు. తమశాఖ పరిధిలో పనిచేస్తున్న స్వయం సహాయ సంఘాలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలని కేటీఆర్ను ఎర్రబెల్లి కోరారు. యంగ్వన్ కంపెనీ కార్యకలాపాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు తమశాఖ సిద్ధంగా ఉన్నదని, రానున్న రెండుమూడు నెలల్లో శిక్షణ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.