హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ‘కొండ’ంత రాగం తీసి.. పనికిరాని పాటపాడిన చం దంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాషాయం పంచన చేరాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొండా తీసుకొన్న నిర్ణయం కాంగ్రెస్ రాష్ట్ర నేతలను కంగు తినిపించింది. గతంలో ఏ పార్టీపైన కొండా దుమ్మెత్తిపోశారో ఇప్పుడు అదే పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా దిగజారుడేనని గాంధీభవన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొండా విశ్వేశ్వర్రెడ్డి బుధవారం తన ఇంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్చుగ్తో భేటీ అనంతరం బీజేపీలో చేరాలని నిర్ణయించుకొన్నారు.
కొండా సన్నిహితులు, బీజేపీ వర్గాల కథనం ప్రకారం జూలై 1న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన విశ్వేశ్వర్రెడ్డికి గుజరాత్లో వందల కోట్ల విలువైన భారీ కాంట్రాక్ట్ను ఇవ్వడానికి బీజేపీ ఎరచూపినట్టు కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో చేవెళ్ల నుంచి విశ్వేశ్వర్రెడ్డికి ఎంపీ టికెట్తోపాటు ఆయన కుమారుడికి తాండూరు నుంచి, సమీప బంధువుకు మహేశ్వర్వం నుంచి టికెట్లు ఇవ్వడానికి బీజేపీ అధినాయకత్వం హామీఇచ్చినట్టు సమాచారం.
కొత్తపార్టీ ప్రచారం ఉత్తిదే..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. బీజేపీలో చేరిన మాజీ మంత్రి, కాంగ్రెస్కు చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేతో కలిపి కొత్త పార్టీ ఏర్పాటుకు విశ్వేశ్వర్రెడ్డి పెట్టుబడి పెట్టనున్నారని ప్రచారం జరిగింది. బీజేపీలో చేరాలని తనను ఆ పార్టీ అగ్రనేతలు సంప్రదిస్తే.. వారి సిద్ధాంతాలతో పొసగదని తిరస్కరించినట్టు ప్రచారం చేసుకొన్నారు. ఇప్పుడు హఠాత్తుగా కాషాయం కండువా కప్పుకొనేందుకు సిద్ధపడ్డారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే గతంలో మాజీ మంత్రిని బీజేపీలో చేరడానికి రాయబారం నడిపిన నాయకుడే.. కొండాను కమలం గూటికి చేర్చడానికీ రాయబారం నెరిపినట్టు తెలిసింది.