హైదరాబాద్ : ఉద్యమాలకు దివంగత మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ దిక్సూచి లాంటి వారని విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నాటి క్విట్ ఇండియా మూమెంట్ మొదలుకొని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు సాగిన ఉద్యమాలలో ఆయన భాగస్వామ్యం విస్మరించ లేనిదని ఆయన కొనియాడారు.
మాజీమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన చిత్ర పటానికి మంత్రి జగదీష్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. 1941 లో గాంధీజీని కలసిన ప్రేరణతో 1942 లో జరిగిన క్విట్ ఇండియా మూమెంట్ మొదలు కొని నిన్నటి ప్రత్యే తెలంగాణ ఉద్యమం వరకు ఆయన పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు.
రజాకార్లకు వ్యతిరేకంగా 1947 నుంచి 1948 వరకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణా సాయుధ పోరులో ఆయన పాత్ర అనిర్వచనియమైనదన్నారు. 1952 లో ముల్కి నిబంధనలను వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమంతో పాటు 1969 లో మొదలైన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తొలి ఉద్యమం నుంచి మొదలు కేసీఆర్ ప్రారంభించిన మలిదశ తెలంగాణా ఉద్యమం వరకు ఆయన పాత్ర ఆమోఘమైనదన్నారు.
అలాంటి మహానేత గురించి ఒక్కటే మాటలో చెప్పాలి అంటే ఉద్యమాలకు దిక్సూచి అని చెప్పొచ్చన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు.