హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : ‘నిన్నమొన్న పార్టీలోకి వచ్చి తమాషా చేస్తున్నడా…?’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకుంటే మంచిదని హెచ్చరించారు.
శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. తనను పార్టీలోంచి వెళ్లగొట్టేందుకు రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చండూరు సభలో రేవంత్రెడ్డి ఆయన అనుచరులతో కావాలనే తనను తిట్టించారని అన్నారు. అందుకు రేవంత్రెడ్డే స్వయంగా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారు ఆశిస్తున్నట్లుగా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే నాలుగు పార్టీలు మారినవారు ఐదో పార్టీలోకీ వెళ్తారని.. తానుమాత్రం కాంగ్రెస్ను వీడబోనని పరోక్షంగా రేవంత్రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికలకు ముందే రేవంత్రెడ్డి చేతులెత్తేశారని తెలిపారు. రేవంత్రెడ్డి వ్యవహారంపై సోనియా, రాహుల్ వద్దే తేల్చుకుంటానని స్పష్టంచేశారు.