కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చాలా అట్టహాసంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా, సృజనాత్మకంగా దుర్గా పూజా మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలిసారి పెట్ ఫ్రెండ్లీ దుర్గా పూజా పండల్ను నెలకొల్పారు. దుర్గా మాతా కాళ్ల చెంతన రెండు కుక్కలతో కూడిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కోల్కతా పోలీస్ డాగ్ స్క్వాడ్కు చెందిన జాతి శునకాలు ఈ మండపానికి చీఫ్ గెస్ట్గా వచ్చాయి. తొలిసారి ఏర్పాటు చేసిన పెట్ ఫ్రెండ్లీ దుర్గా పూజా పండల్ను అవి ప్రారంభించాయి.
కాగా, కోల్కతా పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. తొలిసారి వినూత్నంగా ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల స్నేహ పూర్వక దుర్గా పూజా మండపానికి తమ డాగ్ స్క్వాడ్ ముఖ్య అతిథిగా వచ్చినట్లు తెలిపారు. డాగ్ స్క్వాడ్లోని నలుగురు సభ్యులైన లాబ్రడార్స్ మోలీ, కాంఫర్, జర్మన్ షెపర్డ్స్ లిజా, డింకీలు దీనిని ప్రారంభించాయని తెలిపారు. బిధాన్ సరనీ అట్లాస్ క్లబ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ పండల్లో తమ డాగ్స్ చాలా ప్రత్యేకంగా కనిపించాయని పేర్కొన్నారు. దుర్గా పూజలో తమ డాగ్ స్క్వాడ్ పాల్గొనడం ఇదే తొలిసారని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వివరించారు.
మరోవైపు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు కూడా భిన్నంగా స్పందించారు. పెట్ ఫ్రెండ్లీ దుర్గా పూజా మండపం ఏర్పాటును స్వాగతించారు. అలాగే ఆ పండల్ను పోలీస్ డాగ్స్ ప్రారంభించడంపై మరింత సంతోషం వ్యక్తం చేశారు. కోల్కతా పోలీసులను కొందరు ప్రశంసించారు.