భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ ఏ నిమిషాన సారథ్య బాధ్యతలు వదిలిపెట్టాడో గానీ సిరీస్కు ఒక సారథి మారుతున్నాడు. ఐపీఎల్ ముగిశాక దక్షిణాఫ్రికాతో సిరీస్కు రిషభ్ పంత్, ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ టెస్టుకు బుమ్రా, పరిమిత ఓవర్లకు రోహిత్ శర్మ సారథ్యం వహించగా శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే వెస్టిండీస్తో వన్డే సిరీస్కు శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. ఈ సిరీస్ ముగిశాక జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీమిండియా మరో సారథి నేతృత్వంలో సిరీస్ ఆడనుందని సమాచారం.
ఆగస్టు 18 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు కెఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించబోతున్నాడని తెలుస్తున్నది. ఐపీఎల్ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు గాయపడి అర్థాంతరంగా తప్పుకున్న రాహుల్.. తిరిగి ఫిట్ అయ్యాడు.
కొద్దిరోజుల క్రితమే జర్మనీలో శస్ర్త చికిత్స చేయించుకుని ఇండియాకు తిరిగివచ్చిన రాహుల్.. ఆ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో శిక్షణపొందాడు. ఎన్సీఏలో శిక్షణ ముగించుకున్న రాహుల్.. ప్రస్తుతం ఫిట్నెస్ టెస్టుకు సిద్ధమవుతున్నాడు. పూర్తిగా ఫిట్గా ఉన్న రాహుల్.. వెస్టిండీస్తో టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటాడని తెలుస్తున్నది.
ఇక విండీస్ పర్యటన ముగిశాక భారత జట్టు నేరుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. సీనియర్ క్రికెటర్లెవరూ ఈ సిరీస్కు ఆసక్తి చూపించకపోవడంతో రెండో స్థాయి జట్టునే జింబాబ్వేకు పంపాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ జట్టుకు ధావన్ను కాకుండా రాహుల్నే సారథిగా నియమించాలని సెలక్టర్లు అనుకుంటున్నారని తెలుస్తున్నది. రోహిత్ శర్మ తర్వాత సారథ్యం అప్పగించేవారి రేసులో రాహుల్ ముందుండగా మరో కెప్టెన్తో వెళ్లడం కూడా కరెక్ట్ కాదనే భావనలో సెలక్టర్లున్నారని సమాచారం. విండీస్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది.