వనపర్తి రూరల్, జూన్ 14: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారినట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం వనపర్తి జిల్లా రూరల్ మండలంలోని కిష్టగిరిలో మార్నింగ్ వాక్లో మంత్రి పాల్గొన్నారు. అధికారులతో కలిసి గ్రామంలోని సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గం పరిధిలోని ప్రతి పల్లె లో చెరువు, కుంటలను కృష్ణమ్మ నీటితో నింపుతామని తెలిపారు. కిష్టగిరి శివారులోని ఊర చెరువుకు కాల్వ ద్వారా నీటిని అందించేందుకు పరిశీలించినట్టు వెల్లడించారు. ఇందుకోసం 1,600 మీటర్ల పైపులైన్ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. చెరువుకు సంబంధించిన తూము, అలుగు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. అనంతరం బడిబాటలో భాగంగా పిల్లలను ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేయాలని సూచించారు.