హైదరాబాద్ సిటీబ్యూరో/ బేగంపేట్ అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మత విశ్వాసాలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడిన సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ చైర్మన్ బిషప్ భాస్కర్ ముల్కల కోరారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్ బుద్ధభవన్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిషప్ భాస్కర్ ముల్కల మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని అగ్రకుల హిందూ మనువాద దురహంకారంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడటం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు.
విద్వేషపూరిత వ్యాఖ్యలతో మత ఘర్షణలకు దారితీసేలా కేంద్రమంత్రి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మైనార్టీ క్రిస్టియన్, ముస్లింలకు రాజ్యాంగ హక్కుగా ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ కిషన్ రెడ్డి ప్రకటించడం రాజ్యాంగ ద్రోహమే అవుతున్నదని చెప్పారు. ఎన్నికల చట్టం ప్రకారం బీజేపీపై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఎంపీ పదవితోపాటు కేంద్ర మంత్రి హోదా నుంచి తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నిక ముగిసే వరకు ఆ ప్రాంతంలో పర్యటించకుండా అతనిపై నిషేధం విధించాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బిషప్ చావల జోసెఫ్, ప్రేమ్ కుమార్, ఇతర క్రైస్తవ నాయకులు ఉన్నారు.