హైదరాబాద్ : కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తింపు విషయంలో నిబంధనలు సడలించి, తెలంగాణలోని ప్రతి చిన్న, సన్నకారు రైతుకు పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, డిజిటల్ అగ్రికల్చర్ విధానం, జాతీయ నూనెగింజలు, అపరాలు, ఆయిల్ పామ్ మిషన్, వ్యవసాయ ఎగుమతులపై వివిధ రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ శాఖా మంత్రులు, ఉన్నతాధికారులతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్ష్యతన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ సహాయమంత్రులు కైలాష్ చౌదరి, శోభా కరంద్లాజే వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
జాతీయ కాన్ఫరెన్స్లో తెలంగాణ తరఫున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 63.26 లక్షల వ్యవసాయ క్షేత్రాలు, కోటి 50 లక్షల ఎకరాల సాగు భూమి ఉందన్నారు. ఇందులో 91.48 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని, కిసాన్ సమ్మాన్ నిధికి కేంద్ర విధించి నిబంధనలతో కేవలం 35.19 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారన్నారు. పథకం వర్తింపు విషయంలో నిబంధనలు సడలించి ప్రతి సన్న, చిన్నకారు రైతుకు పథకం వర్తింపజేయాలని కోరారు. పథకం కింద ఎనిమిదో విడతలో రాష్ట్రానికి ఇచ్చింది రూ.703.81 కోట్లు మాత్రమే.. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద సాలీనా రూ.15వేల కోట్లు ఇవ్వడమే కాకుండా ఇతర వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులను ప్రోత్సహిస్తుందన్నారు.
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సైతం మౌలిక సదుపాయాల నిధిని వర్తింజేయాలన్నారు. డిజిటల్ వ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వేకు సిద్ధమవుతుందన్నారు. డిజిటల్ సర్వే ప్రక్రియ పూర్తి అయిన అనంతరం కేంద్రం చేపట్టిన డిజిటల్ వ్యవసాయ విధానంలో భాగస్వాములవుతామని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా పంట మార్పిడిలో భాగంగా 2024 – 25 నాటికి తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. విదేశాల నుంచి మాత్రమే దిగుమతి చేసుకోగలిగే ఆయిల్ పామ్ విత్తనాలు, నర్సరీ మొక్కల మీద ప్రస్తుతం విధిస్తున్న 30శాతం దిగుమతి సుంకాన్ని గతంలో మాదిరిగా 5శాతానికి పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు మైక్రోకల్చరల్లో భాగంగా అందించే రాయితీలకు విస్తీర్ణ పరిమితిని తొలగించి, రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆయిల్ పామ్ మొక్కల దిగుమతి విషయంలోనూ నిబంధనలు సడలించాలన్నారు. పంట మార్పిడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో పెద్ద ఎత్తున వేరుశెనగ సాగును ప్రోత్సహిస్తుందని వివరించారు. నిబంధనలను సరళీకరించాలని, పంటమార్పిడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో పెద్ద ఎత్తున వేరుశెనగ సాగును ప్రోత్సహిస్తుందన్నారు. కేంద్రం నూనెగింజల సాగు ప్రోత్సాహాల్లో భాగంగా ఇచ్చే మినీకిట్స్ను యాసంగిలో లక్ష ఎకరాల వరకు ఇవ్వాలన్నారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుధాన్యాల సాగు పెంచడంలో భాగంగా రైతులను ప్రోత్సహించేందుకు కేంద్రం పప్పుగింజల కొనుగోళ్ల విషయంలో పరిమితులను ఎత్తివేసి వందశాతం పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ ఎగుమతులు పెంచడానికి ఎగుమతిదారులకు ప్రత్యేకంగా రవాణాలో ఇబ్బందులు అధిగమించేందుకు రాయితీలతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టి సార్టింగ్, ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు విస్తృతంగా కల్పించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఉద్యానవన సంచాలకులు వెంకట్రామ్రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.