హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య ఆర్టీసీ సేవలను కొనియాడారు. తన కూతురు పెళ్లికి ఇటీవల ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ అందించిన సేవలకు సంతోషం వ్యక్తంచేస్తూ తాను అద్దెకు తీసుకున్న బస్సు ముందు తనదైన శైలిలో కిన్నెర వాయిస్తూ పాటను ఆలపించారు. బుక్ చేసిన గంటలోనే బస్సు వచ్చిందని, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చెప్పలేని ఆనందం కలిగించిందని తెలిపారు. పెండ్లికి సురక్షితంగా వెళ్లి వచ్చామని చెప్పారు. అది ఆర్టీసీ బస్సు కాదని, తల్లిలాంటిదని కొనియాడారు. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు. దీంతో మొగులయ్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శభాష్ అని మెచ్చుకున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ సినిమాలో ఆయన పాడిన బీమ్లానాయక్ పాట అందర్నీ ఆకర్షించిన విషయం తెలిసిందే.