హైదరాబాద్ : బాలుడిని దుండగులు అపహరించిన రెండు గంటల్లోనే పోలీసులు రెస్క్యూ చేసి తల్లి ఒడికి తిరిగి చేర్చారు. ఈ ఘటన హైదరాబాద్లో మంగళవారం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన దంపతులు కూతురు, కొడుకు(నాలుగు నెలలు)తో కలిసి తారానగర్లో నివాసం ఉంటున్నారు. భర్త మనోహర్ గత నాలుగేళ్లుగా వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇటీవల నూతనంగా నిర్మాణం చేపట్టిన ఇంటికి వాచ్మెన్గా ఉంటూ ఆ ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో జీవిస్తున్నారు. అయితే గడిచిన రాత్రి వీరంతా నిద్రిస్తున్న సమయంలో మనోహర్ బాత్ర్రూంకు అని లేచి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి తన నాలుగు నెలల కొడుకు కనిపించలేదు. భర్యను లేపి అడుగగా పక్కనే ఉండాలని తనకి కూడా తెలియదంది.
కాగా వీరి కూతురు మాత్రం ఎవరో వచ్చి తమ్ముడిని తీసుకెళ్లినట్లు చెప్పడంతో వెంటనే పోలీసుల వద్దకు పరుగు తీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, చందానగర్ ఎస్హెచ్వో కే. కాస్ట్రో, ఇతర పోలీసు సిబ్బంది సీసీటీవీ కెమెరాల సహాయంతో బాబు ఆచూకీని కనుగొనేందుకు చర్యలు చేపట్టారు. రెండు గంటల్లోనే బాబు ఆచూకీని గుర్తించి తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.