విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. గత నెల 23న కశ్మీర్లో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇక్కడ కీలక సన్నివేశాలను రూపొందించి తొలి షెడ్యూల్ను పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. సీయీవో చెర్రీ. ఫుల్లెంగ్త్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది.
మొదటి షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ…‘ముందు ప్లాన్ చేసిన ప్రకారం తొలి షెడ్యూల్ను పూర్తి చేశాం. కశ్మీర్లోని అందమైన లొకేషన్లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపాం. నిరాటంకంగా షూటింగ్ జరపడానికి సహకరించిన చిత్రబృందం అందరికీ కృతజ్ఞతలు. ఇటీవల విడుదల చేసిన చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్కు మంచి స్పందన వస్తున్నది’ అన్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. జయరాం, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, లక్ష్మీ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.