సత్తుపల్లి, అక్టోబర్ 5: సీఎం కేసీఆర్ సారథ్యంలో బుధవారం ఏర్పడిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తోనే దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితిగా ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంలో దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులు బీఆర్ఎస్తో తొలగిపోనున్నాయని అన్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశం మొత్తం అమలు చేసేలా సీఎం కేసీఆర్ దేశ ప్రజల మద్దతును కూడగడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతో అన్ని పార్టీల నాయకుల చూపు ఇటువైపే ఉందన్నారు. రైతుల పక్షాన నిలబడి వ్యవసాయాన్ని పండుగ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశంలోని రైతుల పక్షాన గతంలోనే గళం వినిపించారని గుర్తుచేశారు. దీంతో దేశ రైతులందరూ తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పెనుమార్పు తీసుకొస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిన బీఆర్ఎస్కు నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు.