ఖమ్మం, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం కొనుగోలు కేంద్రాలను విజయవంతంగా నిర్వహించి వ్యాపార అనుభవాన్ని గడించిన స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక బాధ్యతలను అప్పగించింది. రైతుల నుంచి మిర్చి, మొక్కజొన్న పంటలను సేకరించే అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా అధికారులు పంటల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మిర్చి, మొక్కజొన్న పండుతున్న ప్రాంతాల్లో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ గ్రూప్లు ఏర్పాటు చేశారు. సంఘాలు సేకరించిన పంటను ప్రముఖ కంపెనీలు కొనుగోలు చేసేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒప్పందాలు కుదుర్చుకున్నది.
దళారుల ప్రమేయం లేకుండా..
జిల్లాలో విస్తారంగా మిర్చి పండుతుంది. ఇక్కడ పండిన మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గుర్తింపు, డిమాండ్ ఉంది. కానీ ధర విషయంలో మాత్రం రైతుకు నిరాశ తప్పడం లేదు. రైతుల వద్ద మిర్చి ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గడం, మిర్చి విక్రయించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నేరుగా పల్లెల్లోనే డ్వాక్రా సంఘాల ద్వారా పంట కొనుగోలు చేయించాలని నిర్ణయించింది. సంఘాలు సేకరించిన పంటను ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకు అప్పగిస్తాయి. పంట అందిన రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో కంపెనీలు నగదు జమ చేస్తాయి.
వ్యవసాయక్షేత్రాల్లోనే మిర్చి కొనుగోలు..
వ్యవసాయ క్షేత్రాల్లోనే సంఘాలు మిర్చి సేకరించే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో రైతులకు రవాణా, హమాలీ, కంటా చార్జీల భారం తప్పనున్నది. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునే అగత్యం తప్పింది. మార్కెట్లో డిమాండ్ వచ్చే వరకు నిల్వ చేసుకునే అవసరం తప్పింది. అన్నింటికీ మించి దళారుల బెడద నుంచి విముక్తి కలుగుతుంది. ఇప్పటికే అధికారులు మిర్చి, మొక్కజొన్న అత్యధికంగా పండించే ప్రాంతాలను గుర్తించారు. ప్రస్తుతం మిర్చి పంట కాపు దశలో ఉంది. జనవరిలో పంట చేతికి వస్తుంది. డ్వాక్రా సంఘాలు జిల్లావ్యాప్తంగా 4,360 మంది 10,274 ఎకరాల్లో సాగు చేస్తున్న మిర్చి పంటను సేకరించనున్నాయి. అందుకు మొత్తం 20 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాయి. ఈ ఏడాది 2,05,481 క్వింటాళ్ల మిర్చిని సేకరించవచ్చని అంచనా వేస్తున్నాయి. అలాగే జిల్లావ్యాప్తంగా 725 మంది రైతులు 11,300 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట నుంచి 2,82,500 క్వింటాళ్లను ఎనిమిది కేంద్రాల ద్వారా సేకరించాలని నిర్ణయించాయి. కొనుగోళ్ల బాధ్యతలను మధిర మహిళా ఎఫ్పీవో, సిరివెన్నెల, ఆదర్శ సంఘాలు స్వీకరించాయి.
మహిళా సంఘాలకు లాభాలు..
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతులతోపాటు కంపెనీలు, రైతులకు మధ్యవర్తిత్వం వహిస్తున్న మహిళా సంఘాలకు ఆదాయం లభిస్తున్నది. ప్రతి కిలోకు రూ.4 చొప్పున సంఘాలకు కమిషన్ లభిస్తున్నది. ఇప్పటికే కలెక్టర్ వీపీ గౌతమ్ అధ్యక్షతన ఫ్లాంట్ లిప్డ్స్ అనే సంస్థ మిర్చి కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నది. మొక్కజొన్న కొనుగోలుకు సుగుణ, వెంకీస్, గోద్రేజ్, వేకూల్ అనే సంస్థలు ముందుకు వచ్చాయి. వాటితో త్వరలోనే ఒప్పందం కుదరనున్నది.
మిర్చి కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధం
జిల్లాలో రైతుల నుంచి మిర్చి, మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. జిల్లావ్యాప్తంగా తొమ్మిది మండలాల పరిధిలో మూడు సంఘాలు పంటలు కొనుగోలు చేస్తాయి. ఈమేరకు రైతులను సమాయత్తం చేస్తున్నాం. ఇప్పటికే మిర్చి కొనుగోలుకు ప్లాంట్ లిపిడ్స్ సంస్థతో ఒప్పందం కుదిర్చాం. మొక్కజొన్న కొనుగోలుకు చర్చలు జరుపుతున్నాం.
– విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం