గోదావరి వరదల కారణంగా గోమాతలకు గ్రాసం కరువైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను రక్షించుకునేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇటీవల వరదలతో భద్రాచలం ప్రాంతంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు ఆయన సాయం చేసి దాతృత్వం చాటుకున్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపునకు స్పందించిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య మంగళవారం రూ.10 లక్షల వ్యయంతో పశుగ్రాసం, బాధిత కుటుంబాలకు వంట పాత్రలు, దుస్తులు పంపిణీ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి 50ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని తెప్పించి, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా 120 కిలోమీటర్లు ప్రయాణించి భద్రాచలం చేరుకున్నారు. గోశాలలకు పశుగ్రాసాన్ని వితరణ చేశారు.
ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాచలం/ దుమ్ముగూడెం/ సత్తుపల్లి, జూలై 26: ఇటీవల బీభత్సం సృష్టించిన గోదావరి వరదల కారణంగా ఆ ప్రాంతంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపునకు స్పందించిన సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య.. మంగళవారం రూ.10 లక్షల వ్యయంతో పశువులకు పశుగ్రాసం, బాధిత కుటుంబాలకు వంట పాత్రలు, దుస్తులు పంపిణీ చేశారు.
ఇటీవల వచ్చిన గోదావరి వరదలు భద్రాచలం, బూర్గంపహాడ్, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోని వంట సామగ్రి సహా ఇతర వస్తువులన్నింటినీ తుడిచిపెట్టుకుపోయాయి. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. ప్రధానంగా ముంపు ప్రాంతాల్లో రైతులు నిల్వ ఉంచిన వరిగడ్డి మొత్తం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో పశుగ్రాసం లేక పశువులు అల్లాడుతున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వెంటనే స్పందించారు. తన నియోజకవర్గ రైతుల సహకారంతో మంగళవారం భద్రాచలంలోని నాలుగు గోశాలలకు 50 ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని వితరణ చేశారు. భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో ఉన్న పురుశోత్తపట్నం గల భద్రాచలం దేవస్థాన గోశాల, అంబాసత్రం గోశాల, గాయత్రి గోశాలకు ఆయన పశుగ్రాసాన్ని అందించారు.
అలాగే దుమ్ముగూడెం మండలంలోని గంగోలు, సున్నంబట్టి, ఎల్ఎన్రావు పేట, వర్క్షాప్, రేగుబల్లి గ్రామాల్లో వరదకు సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల విలువైన వంట పాత్రలు, మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు, కండువాలు, చొక్కాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావులతో వీటిని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. 15 రోజులుగా పశుగ్రాసం లేకుండా మూగజీవాలు ఇబ్బంది పడుతున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస శిబిరాలకు వెళ్లడంతో పశువుల ఆలనాపాలనా చూడలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వాగతం పలికిన ఐటీడీఏ పీవో..
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామివారి దేవస్థానం గోశాల, అంబాసత్రంలోని గోశాల, గాయత్రి గోక్షేత్రాల్లోని గోవుల కోసం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన నియోజకవర్గం నుంచి 50 ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని తీసుకొచ్చారు. ఆ ట్రాక్టర్లకు గోదావరి బ్రిడ్జి వద్ద ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట వీరయ్య మాట్లాడుతూ గోవుల ఆకలి తీర్చేందుకు జోరు వానలోనూ 120 కిలోమీటర్లు ప్రయాణించి భద్రాచలం చేరుకున్నామన్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తెల్లం సీతమ్మ, రేసు లక్ష్మి, అన్నెం సత్యనారాయణమూర్తి, కణితి రాముడు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, చంద్రశేఖర్, తిరుపతిరావు, చల్లగుళ్ల కృష్ణయ్య, మట్టా ప్రసాద్, వల్లభవనేని పవన్, చాంద్పాషా, ఏగోటి పెద్దిరాజు, దేశిరెడ్డి కృష్ణారెడ్డి, జగ్గారెడ్డి, చింతల సురేందర్రెడ్డి, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.