ఆ కళాశాల.. విద్యార్థుల క్రమశిక్షణకు నిలయం, ఉన్నత శిఖరాలకు సోపానం.. దశాబ్దాలుగా ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దింది. ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తున్నది. కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లిలో ఏర్పాటు చేసిన శ్రీరామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ఆధునిక హంగులతో సరికొత్త సాంకేతికతను పుణికి పుచ్చుకొని జాతీయస్థాయిలో న్యాక్ -బీ గ్రేడ్ గుర్తింపు తెచ్చుకున్నది. ఈ కళాశాల ప్రస్తుతం ఐదు కోర్సులను ఆఫర్ చేస్తున్నది. బీఏ ఇంగ్లిష్, తెలుగు మీడియం, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సుల్లో విద్యాబోధన జరుగుతున్నది. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం దోస్త్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఒక్కొక్క కోర్సులో 60సీట్లు కేటాయించారు.
– లక్ష్మీదేవిపల్లి, జూలై 26
కళాశాల ప్రత్యేకతలు ఇవే…
శ్రీరామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలకు నాక్- బీ గ్రేడ్ గుర్తింపు వచ్చింది. ఇక్కడ నిష్ణాతులైన అధ్యాపకులతో విద్యాబోధన సాగుతున్నది. విశాలమైన తరగతి గదులు, డిజిటల్క్లాస్ రూమ్లో తరగతులు బోధిస్తున్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ద్వారా విశ్వవిద్యాలయ స్థాయిలోనూ విద్యార్థులు ప్రతిభ కనపర్చారు. 20వేలకు పైగా గ్రంథాలతో కూడిన లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంది. విద్యార్థులకు శారీరక వికాసం కోసం అత్యాధునిక జిమ్, సువిశాలమైన క్రీడా స్థలం ఏర్పాటు చేశారు. అన్ని వసతులతో ప్రయోగశాల అందుబాటులో ఉంది. కంప్యూటర్ ల్యాబ్ కెరియర్ గైడెన్స్ సెల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయమూ ఉన్నది.
అత్యున్నత ఫలితాలు కళాశాల సొంతం..
అన్ని వసతులతో విద్యాబోధన జరుగుతుండడంతో విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ప్రతి ఏడాది ఫలితాలు అత్యున్నతంగా ఉంటున్నాయి. క్రీడల్లో కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. జాతీయ స్థాయిలో కూడా అనేక పతకాలను కైవసం చేసుకున్నారు. అలాగే పీజీ, ఎంకామ్ ఫ్రీ కోచింగ్ క్లాసులూ ఇస్తున్నారు.
జాతీయ స్థాయిలో బీ గ్రేడ్
రామచంద్ర కళాశాల జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. ఈ కళాశాల బీ గ్రేడ్ సాధించింది. ఈ ఏడాది జూన్ 27, 30 తేదీల్లో నాక్ కమిటీ కళాశాలను సందర్శించింది. ఇక్కడ అందిస్తున్న విద్య, సౌకర్యాలను పరిశీలించిన బృందం జాతీయ స్థాయిలో బీ గ్రేడ్ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దోస్త్ షెడ్యూల్ ఇలా…
దోస్త్లో శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. ఈ నెల 28, 29 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 6న సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 7 నుంచి 18వ తేదీ వరకు విద్యార్థులు కళాశాలలో రిపోర్టు చేయాలి. 7వ తేదీ నుంచి రెండో దశ ప్రారంభమవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు పాస్పోర్టు సైజ్ ఫొటో, ఆధార్కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇంటర్ సెకండియర్ హాల్టిక్కెట్, ఎస్ఎస్సీ మెమో, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, రూ.225 రిజిస్ట్రేషన్ ఫీజు, మొబైల్ నంబర్ అవసరం ఉంటాయి.
నాణ్యమైన విద్యను అందిస్తున్నాం
కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. మొత్తం 5 కోర్సుల్లో అడ్మిషన్లు ఇస్తున్నాం. డిగ్రీ చేయాలనుకునే వారు దోస్త్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికే అడ్మిషన్లపై ప్రచారం నిర్వహించాం. ప్రతి కోర్సులో 60 సీట్లు కేటాయించాం. ఆగస్టులో తరగతులు ప్రారంభిస్తాం.
– హవిలా, కళాశాల ప్రిన్సిపాల్