భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 26 (నమస్తే తెలంగాణ):ఇరుకు గదుల్లో, ఇతర భవనాల్లో కొనసాగుతున్న కొంత పంచాయతీ కార్యాలయాల సమస్య కొలిక్కి వచ్చింది. సమావేశాల నిర్వహణ, సర్పంచ్ల చాంబర్ల కోసం ప్రత్యేక గదులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొత్త పంచాయతీల్లో కార్యాలయాల సమస్యలకు ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న కొత్త పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయబోతోంది. ఇప్పటికే ఆయా మండలాల్లో ఉన్న పంచాయతీల భవనాలకు స్థల సేకరణ పూర్తి చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో కొత్తగా 276 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు రాబోతున్నాయి.
ఇందుకోసం భవన నిర్మాణాలకు తక్షణమే స్థల సేకరణ చేయాలని కలెక్టర్ అనుదీప్ రెవెన్యూ, పంచాయతీ అధికారులను ఆదేశించారు. పాలనా సౌలభ్యం కోసం 500జనాభా ఉన్న గిరిజన తండాలు, శివారు గ్రామాలను ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. జిల్లాలో 276 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటికి పక్కా భవనాలు నిర్మించాలని అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం గిరిజన సంక్షేమ సబ్ ప్లాన్ నిధులను ఇటీవలే కేటాయించింది. ఒక్కో పంచాయతీ భవనానికి రూ.25 లక్షలు మంజూరు కానున్నాయి. ఒక్కో భవనానికి 500 నుంచి వెయ్యి గజాల వరకు స్థలం కావాల్సి ఉండగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు స్థలాలను పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి పంపారు. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి.
తొలగనున్న ఇబ్బందులు
జిల్లాలో గతంలో 205 గ్రామ పంచాయతీలు ఉండగా 2019లో కొత్తగా మరో 276 పంచాయతీలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో వాటిని అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, అద్దె భవనాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీ సర్పంచ్లు సమావేశాల ఏర్పాటుకు కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. పరిపాలన ప్రజలకు చేరువకావాలని ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీలకు అదే స్థాయిలో వాటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సొంత భవనాలను మంజూరు చేసింది. దీంతో పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 481 పంచాయతీలు ఉండగా 189 జీపీలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. 292 పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాల్సి ఉండగా, ప్రస్తుతం 276 మాత్రమే మంజూరయ్యాయి. మరికొన్ని భవనాలు కూడా పాతవి కావడంతో వాటి స్థానంలో కూడా కొత్తవి కావాలని సర్పంచ్లు ఇప్పటికే అధికారులకు తెలియజేశారు.
276 పంచాయతీలకు భవనాలు మంజూరు..
కొత్త పంచాయతీలకు భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. స్థల సేకరణ కూడా పూర్తి చేశాం. 276 కొత్త గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరు కాబోతున్నాయి. గత మూడేళ్లుగా కొత్త పంచాయతీలు అద్దె భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లలో కొనసాగుతున్నాయి. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభమవుతాయి.
-లక్ష్మీరమాకాంత్, డీపీవో, కొత్తగూడెం