ఖమ్మం లీగల్, జూన్ 26: సమాజంలో శాంతి, సామరస్యాలు ఎంతో ముఖ్యమైనవని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజీ మార్గం దైవ కార్యంతో సమానమని, దానిని అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని అన్నారు. ఖమ్మంలోని న్యాయసేవా సదన్లో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏదైనా కేసులో కోర్టు ద్వారా తీర్పు వస్తే అదే అంతిమ తీర్పు కాదని, తదుపరి కోర్డుకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే లోక్ అదాలత్ ద్వారా రాజీ పడితే అదే అంతిమ తీర్పు అవుతుందని స్పష్టం చేశారు. రాజీకి కృషి చేసేవారు దైవానుగ్రహాన్ని పొందుతారని అన్నారు. లోక్ అదాలత్ రాజీ వల్ల ఇరువర్గాలూ గెలుపొందినట్లేనని అన్నారు. మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ నీరుథ్, న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి అబ్దుల్ జావీద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
మూడు దశాబ్దాల వివాదానికి ముగింపు..
ఖమ్మంలో ఆదివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో మూడు దశాబ్దాల వివాదానికి ముగింపు లభించింది. ఆసక్తికరమైన ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలేనికి చెందిన కుతుంబాక కుటుంబంలో ఆరుగురు సభ్యులు. అందులో కుతుంబాక చిద్విలాసరావు మరణించిన తరువాత ఉమ్మడి కుటుంబానికి ఉన్న 14 ఎకరాల ఆస్తి పంపకంపై వివాదం తలెత్తింది. ఫలితంగా చిద్విలాసరావు కుమారుడు తన వాటా కేటాయింపు కోసం అతడికి 14 ఏళ్ల వయసున్నప్పుడు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా దాఖలు చేశాడు. 1993లో దాఖలైన ఈ దావా వివిధ మలుపులు తిరుగుతూ ఇంకా అపరిష్కృతంగా ఉండి పోయింది. ఈలోపు ప్రతివాదుల్లో ముగ్గురు మరణించగా వారి వారసులను కేసులో చేర్చారు. వివాదం ఇలా కోర్టులో కొనసాగుతుండగా జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా వివాద పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అందరూ రాజీకి రావడంతో మూడు దశాబ్దాల వివాదానికి తెరపడింది.
17,890 కేసుల పరిష్కారం..
ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆదివారం 17,890 కేసులు పరిష్కారమయ్యాయి. సివిల్ ,క్రిమినల్, చెక్ బౌన్స్, మోటరు వాహన ప్రమాద బీమా కేసులు పరిష్కారమయ్యాయి. వాహన ప్రమాదాల కేసుల్లో రూ.3.46 కోట్ల పరిహారం బాధితులకు అందింది.
ఆరోగ్య శిబిరం..
లోక్ అదాలత్ సందర్భంగా ఎక్కువమంది కక్షిదారులు కోర్టుకు వచ్చే అవకాశం ఉన్నందున వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా న్యాయమూర్తి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు.. అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు.
భద్రాద్రి జిల్లాలో 12,137 కేసులు..
కొత్తగూడెం లీగల్, జూన్ 26 : జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఆదివారం భద్రాద్రి జిల్లాలో 12,137 కేసులు పరిష్కారమయ్యాయి. భద్రాద్రి జిల్లా ఏర్పడిన తర్వాత తొలి జాతీయ లోక్ అదాలత్ను కొత్తగూడెం కోర్టుల ఆవరణలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జీ.భానుమతి ప్రారంభించి మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కొత్తగూడెం కోర్టులో 5,795, ఇల్లెందులో 1,308, భద్రాచలంలో 4,093, మణుగూరులో 941 కేసులు పరిష్కారమయ్యాయి. మోటర్ యాక్సిడెంట్ కేసుల్లో రూ.25.60 లక్షలు, సివిల్ దావాల్లో రూ.8.50 లక్షలు, ఫైన్ అమౌంట్ రూ.లక్ష పరిహారం బాధితులకు మంజూరైంది. మనోవర్తి, డొమెస్టిక్ వయొలెన్స్, బ్యాంకు రుణాల కేసుల్లో రాజీకి అవార్డులు వచ్చాయన్నారు. న్యాయమూర్తులు కాసర్లగడ్డ దీప, సుల్తానా, ముద్దసాని నీలిమ, ఏపీపీ పీవీడీ లక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుబ్రోలు రాంప్రసాదరావు, న్యాయవాదులు జనపరెడ్డి గోపీకృష్ణ, మహేశ్వరరావు, కాసాని రమేశ్, మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాజమల్లు, సిబ్బంది పాల్గొన్నారు.