ఖమ్మం, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆసరా పింఛన్ల పంపిణీకి ఈ సారి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. దీంతో కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకున్న వారికి భరోసా లభించింది. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. జిల్లాలో ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో 1,54,367 మందికి ప్రతి నెలా రూ.33.53 కోట్ల పింఛను అందుతున్నది. కొత్తగా పింఛన్లకు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ, పైలేరియా బాధితులు 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఇప్పటికే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హుల జాబితాను సిద్ధం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సు 57 సంవత్సరాలకు తగ్గించాలని గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విభాగంలో జిల్లాలోని 21 మండలాల నుంచి 30,279 దరఖాస్తులు వచ్చాయి. వాటిని అధికారులు దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది.
కొత్త దరఖాస్తుల పరిశీలన, అర్హుల జాబితా రూపకల్పన ప్రక్రియను వేగంగా చేపట్టాలని రాష్ట్ర అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రారం భమవుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే వివిధ మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు క్రోడీకరించి అర్హుల జాబితాను సిద్ధం చేశారు.
జిల్లాలో ప్రస్తుతం వృద్ధులు 51,192 మంది, వితంతువులు 63,039, దివ్యాంగులు 25,114, గీత కార్మికులు 3,020, బీడీ కార్మికులు 10, చేనేత కార్మికులు 441, ఒంటరి మహిళలు 7,904, హెచ్ఐవీ బాధితులు 2,323, పైలేరియా 1,233 మందికి ప్రతి నెలా పింఛను అందుతున్నది. కొత్తగా పింఛనుకు దరఖాస్తులు చేసుకున్న వారిలో వితంతువులు 9,703 మంది, దివ్యాంగులు 5,040, వృద్ధులు 3,631, గీత కార్మికులు 349, చేనేత కార్మికులు 29, ఒంటరి మహిళలు 742, హెచ్ఐవీ బాధితులు 470, పైలేరియా బాధితులు 288 మంది ఉన్నారు. వీరి దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే పూర్తయింది.