కారేపల్లి, జూలై 28: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు. కారేపల్లి మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్.. తొలుత అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి విద్యార్థులకు అందజేస్తున్న పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి ‘మన ఊరు – మన బడి’ ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు.
ఆక్రమణకు గురైన కారేపల్లి పెద్దచెరువు శిఖం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మత్స్యకారులు చేపడుతున్న రిలేనిరాహారదీక్ష శిబిరం వద్దకు చేరుకొని వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పెద్దచెరువు అలుగు ప్రదేశంలో గల స్థలాన్ని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లి పరిశీలించారు. అనంతరం పేరుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా మాదారం గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెగా పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. అక్కడ నాటిన మొక్కలను, జరుగుతున్న పనులను పరిశీలించి స్థానిక సర్పంచ్ అజ్మీరా నరేశ్ను అభినందించారు. డోలమైట్ మైన్స్ అధికారులతో మాట్లాడుతూ వారి స్వాధీనంలో ఉన్న ఖాళీ స్థలాల్లో కూడా మొక్కలు నాటాలని సూచించారు. కారేపల్లి క్రాస్రోడ్ నుంచి కారేపల్లి వరకు ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా ఎదుగుతున్న మొక్కలను చూసి ఎంపీడీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. డీఆర్డీవో విద్యాచందన, డీఈవో యాదయ్య, ఇరిగేషన్ డీఈ వెంకట్నాయక్, తహసీల్దార్ రవికుమార్, సర్పంచ్లు ఆదెర్ల స్రవంతి, అజ్మీరా నాగేశ్వరరావు, అజ్మీరా అరుణ, అజ్మీరా నరేశ్, ఎంపీవో రాజారావు పాల్గొన్నారు.