జిల్లాలో కరోనా కలకలం
రోజుకు 25 నుంచి 40 మందికి పాజిటివ్
దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు దిశానిర్దేశం
2 వేలకు తగ్గకుండా టెస్ట్లు చేయాలని ఆదేశం
స్వీయ జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు
ఖమ్మం సిటీ, మార్చి 25: జిల్లాలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. రోజుకు 2వేలకు తగ్గకుండా టెస్ట్లు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షణలో జిల్లా వైద్యారోగ్యశాఖ పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలతోపాటు 4 అర్బన్ హెల్త్ సెంటర్స్, 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్ట్లు చేసేందుకు అవసరమైన కిట్స్ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహకారంతో మమత జనరల్ హాస్పిటల్లో కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. రెండు మొబైల్ వాహనాలను గ్రామగ్రామానికి తిప్పుతూ అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. దీంతో జిల్లాలో రోజుకు 1000 మందికి కరోనా టెస్ట్లు నిర్వహిస్తున్నారు. వారిలో సరాసరి 25 నుంచి 40 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతున్నది. వారందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎవరికైనా తీవ్రత ఎక్కువైతేనే 108 ద్వారా ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు. పాజిటివ్గా వచ్చినప్పటికీ కేవలం ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారు.
ముమ్మరంగా వ్యాక్సినేషన్..
కరోనా ముప్పు నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించేందుకు సర్కార్ తలపెట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి 61,400 డోసులు జిల్లాకు వచ్చాయి. మొదటి దశ 22,090, రెండో డోసు 8,741 మొత్తం 30,831 మందికి టీకాలు వేశారు. ప్రస్తుతం ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, అర్బన్ హెల్త్ సెంటర్స్, మరో 8 గుర్తించిన ప్రైవేట్ వైద్యశాలల్లో మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. శనివారం నుంచి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసేందుకు వైద్యారోగ్యశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉచితంగా, ప్రైవేట్లో రూ. 250లు చెల్లించి వ్యాక్సిన్ పొందవచ్చు.
వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ
భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా.. పెడచెవిన పెడుతూ విందులు, వినోదాలు జరుపుకుంటున్నారు. కొత్త సినిమా వచ్చిందంటే చాలు గుంపులు గుంపులుగా వెళ్తూ.. వందల సంఖ్యలో ఒకేచోట చేరుతూ వైరస్కు ఆహ్వానం పలుకుతున్నారు. అయితే తెలంగాణ సర్కార్ ఆదేశానుసారం రంగంలోకి దిగిన జిల్లా వైద్యారోగ్యశాఖ యంత్రాంగం కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. గతంలో మాదిరి మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నారు. మండల మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంపీడీవో, పోలీసుల సహకారంతో వైరస్ వ్యాప్తికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 10 ఐసీయూ బెడ్లను, 20 ఐసోలేషన్ బెడ్లను సిద్ధంగా ఉంచారు. బాధితుల సంఖ్య పెరిగితే ప్రత్యేకంగా కేటాయించిన అధునాతన భవనంలోని 280 బెడ్లను కేటాయిస్తామని ఆర్ఎంవో డాక్టర్ బీ వెంకటేశ్వర్లు తెలిపారు.
స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిందే
కరోనా వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి జిల్లాలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. కాకపోతే ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలి. విధిగా మాస్క్ ధరించాలి. భౌతికదూరం పాటించాలి. శానిటైజర్ లేదా సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పెండ్లిళ్లు, ఇతర వేడుకలకు దూరంగా ఉండాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. సినిమాలకు వెళ్లడం తగ్గించాలి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.