హైదరాబాద్ : ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్బండ్ వరకు సాగింది. ఇక్కడ చివరిసారిగా నిర్వాహకులు పంచముఖ రుద్ర మహాగణపతికి పూజలు నిర్వహించారు.
అనంతరం నాలుగో నంబర్ క్రేన్ ద్వారా మహాగణపతిని హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేశారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 8.18 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్లో యాత్ర ప్రారంభం కాగా.. సుమారు 6 గంటల పాటు శోభాయాత్ర కొనసాగింది. నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్ మళ్లించారు. ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.