కొచ్చి: శబరిమలకు వెళ్లేందుకు తొమ్మిదేళ్ల బాలికకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దేవాలయానికి తన తండ్రితో పాటు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాలిక హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ విచారణ జరిపిన న్యాయస్థానం బాలికను ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది. పది సంవత్సరాలు నిండే లోపు ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటోందని బాలిక తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.
ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే మళ్లీ ఆలయాన్ని చూసేందుకు మరో 40 సంవత్సరాల వరకు ఆమెకు అవకాశం ఉండదని వాదించారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ నెల 23న బాలికను తండ్రితో పాటు ఆలయంలోకి అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏప్రిల్లోను కోర్టు ఇలాంటి తీర్పునే ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న పెద్దలు పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ పిల్లలను అనుమతించాలని చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తీర్మానం చేసింది.
ఇదిలా ఉండగా.. ఏటా నిర్వహించే నిరపుతారి వేడుక కోసం అయ్యప్ప ఆలయ ద్వారాలు ఈ నెల 15న తెరుచుకున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిత్యం 15వేల మంది భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఈ నెల 23 తేదీతో వేడుకలు ముగియనుండగా.. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు.