తిరువనంతపురం, అక్టోబర్ 25: కేరళలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింతగా ముదిరాయి. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు రాజీనామా చేయాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికారాల విషయంలో హద్దులు దాటొద్దని ముఖ్యమంత్రి విజయన్ గవర్నర్కు గట్టి హెచ్చరిక చేయగా, మరోవైపు గవర్నర్ తీరుకు నిరసనగా అధికార ఎల్డీఎఫ్ కూటమి మంగళవారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. నవంబర్ 15న రాజ్భవన్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పును ఉటంకిస్తూ తొమ్మిది వర్సిటీల వీసీలు సోమవారం రాజీనామాలు పంపాలని గవర్నర్ ఆదివారం ఆదేశించిన విషయం తెలిసిందే.
మరో రెండు వర్సిటీల వీసీలకు నోటీసులు
రాజీనామాకు వీసీలు తిరస్కరించడంతో గవర్నర్ సోమవారం వారికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. మిమ్మల్ని ఎందుకు తొలగించకూడదో నవంబర్ 3లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. గవర్నర్ మంగళవారం మరో రెండు యూనివర్సిటీ వీసీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం గమనార్హం. పదవిలో కొనసాగేందుకు ఉన్న చట్టపరమైన హక్కులు, మీ నియామకాలు చట్టవిరుద్ధమని ఎందుకు ప్రకటించకూడదో కారణాలు తెలుపాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్ మీడియా సమావేశాలకు హాజరుకాకుండా కైరాలి, రిపోర్టర్, మీడియావన్, జైహింద్ అనే 4 టీవీ చానెళ్లను నిషేధిస్తూ రాజ్భవన్ వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది.
రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహారశైలి
సీఎం విజయన్ సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గవర్నర్ తీరుపై మండిపడ్డారు. వీసీల రాజీనామాలు కోరే అధికారం గవర్నర్కు లేదన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ 8మంది వీసీలు సోమవారం కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రత్యేక విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తగిన విధివిధానాలు అనుసరించిన తర్వాతనే తొలగించేందుకు అవకాశం ఉంటుందని, అప్పటి వరకు వీసీలు పదవిలో కొనసాగవచ్చునని స్పష్టం చేసింది.