తిరువనంతపురం : భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేరళలో ప్రభుత్వం శనివారం నుంచి 48 గంటల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించింది. అత్యవసర సేవలు మినహా మినహాయించి అన్ని రంగాలకు సెలవులు ప్రకటించింది. అనవసరంగా రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ తిరుగకుండా చూసేందుకు ఉదయం నుంచి పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. పోలీసు వర్గాల సమాచారం మేరకు.. అవసరమైన వ్యక్తులకు ప్రయాణానికి అనుమతి ఉంటుందని, ప్రభుత్వ ఆంక్షలు, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించనున్నట్లు తెలిపారు.
మరో వైపు కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ) బస్సు సర్వీసులు నడుపుతున్నా చాలా జిల్లాల్లో వైరస్ భయంతో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచినా.. పార్శిల్ సర్వీస్కు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కూరగాయలు, పండ్లు, మాంసం దుకాణాలు కొనసాగాయి. ఎర్నాకుళం జిల్లాకు వచ్చిన వలస కార్మికులను పోలీసులు తిరిగి పంపించి వేశారు. కొచ్చిలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ ప్రైవేటు ట్యాక్సీ క్యాబ్పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. వచ్చే సోమవారం సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగనుంది.
ఇందులో మరిన్ని ఆంక్షలపై నేతలతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 21న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం అన్ని కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలకు 24న సెలవు ప్రకటించనున్నట్లు పేర్కొంది. 25న సైతం అత్యవసర సేవలు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం కేరళలో 28,447 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు వారీ కొవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం. ప్రస్తుతం 1.78 లక్షల మంది మహమ్మారి బారినపడి చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది.
ఇవికూడా చదవండి..