తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇవాళ సీపీఎం(మార్కిస్టు) పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 83 మంది అభ్యర్థులతో తొలి లిస్టును ప్రకటించారు. సీఎం పినరయి విజయన్ ఈసారి ధర్మదం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి కేకే శైలజా.. మట్టన్నూర్, తవనూర్ నుంచి కేటీ జలీల్ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి విజయరాఘవన్ వెల్లడించారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వ అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని జాబితాను తయారు చేసినట్లు విజయరాఘవన్ తెలిపారు. కూటమి అభ్యర్థుల కోసం ఈసారి సీపీఎం ఏడు సీట్లను వదులుకున్నది. దాంట్లో అయిదు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. సీపీఎం తమ అభ్యర్థుల్లో 12 మంది మహిళలకు స్థానం కల్పించారు. మంజీశ్వరం, దేవీకులమ్ స్థానాలకు ఆ పార్టీ ఇంకా పేర్లను ప్రకటించలేదు. ప్రకటించిన 83 మందిలో 74 మంది సీపీఎంకు చెందినవారు కాగా మరో 9 మంది ఆ పార్టీ మద్దతు ఉన్నవారు పోటీచేయనున్నారు.